ధాన్యం కొనుగోలుకు బ్రేక్
●
తిరుపతి అర్బన్: ధాన్యం కొనుగోలుకు బ్రేక్ పడింది. జనవరి 21వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి సొసైటీ ఉద్యోగులు సమ్మెలో చేస్తున్నారు. ఈ క్రమంలో గత ఆరు రోజులుగా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియకు ఆటంకాలు తప్పడం లేదు. సొసైటీ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో పార్మర్ గ్రూపులకు సొసైటీ బాధ్యతలు శనివారం నుంచి అప్పగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అవగాహన ఉన్నప్పటికీ సొసైటీ వారే పలు తప్పులు చేస్తున్నారు. అవగాహన లేని పార్మర్ గ్రూపులకు కీలక బాధ్యతలు అప్పగిస్తే మరెన్ని తప్పులు జరిగే ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. పార్మర్ గ్రూపులకు కాకుండా సొసైటీ పనులు సైతం అగ్రికల్చర్ అధికారులకు అప్పగిస్తే సమస్యలు తగ్గుతాయని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంతో అగ్రికల్చర్, సొసైటీ, రైస్ మిలర్ల ఆధ్వర్యంలో సివిల్ సప్లయి అధికారులు సమష్టిగా చేస్తున్నారు.
–ఈ ఏడాది రబీ సీజన్లో 1.65 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. 90శాతం వరకు అగ్రికల్చర్ అధికారులు పంట ఈ–క్రాప్, ఈకేవైసీ చేశారు. ఈ క్రాప్ చేస్తున్నవారంతా ప్రభుత్వానికి ధాన్యం విక్రయించడానికి అర్హత పొందినట్లు అధికారులు తెలిపారు. 5 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇందులో అన్ని అవసరాలు పోనూ సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం సివిల్ సప్లయి అధికారులు ఈ సీజన్లో కొనుగోలు చేయాల్సి ఉంది. జనవరి 21న కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టారు. ఫిబ్రవరి 21కి (నెల రోజుల్లో) 21వేల టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా 1.79 లక్షల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది.
ధాన్యం కొనుగోలుకు ప్రత్యామ్నాయ చర్యలు
ధాన్యం కొనుగోలుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాం. సొసైటీ ఉద్యోగులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో వారి స్థానంలో పనిచేయడానికి రైతు సమూహాలకు(పార్మర్ గ్రూపులకు) శనివారం నుంచి బాధ్యతలు అప్పగించాం. వ్యవసాయశాఖ, సొసైటీ, సివిల్ సప్లయి ఉద్యోగులు సమష్టిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే సొసైటీ ఉద్యోగులు సమ్మెలో ఉన్న తరుణంలో రైతు సేవా కేంద్రాల్లో, మండల వ్యసాయ కేంద్రా ల్లో ఫార్మర్ గ్రూప్లోని సభ్యులకు బాధ్యతలు అప్పగించాం. ఇప్పటికే రైతుల నుంచి 21,811 టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల వ్యవధిలోనే రైతు ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం. ఆసక్తి ఉన్న ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తాం. – గోవిందరావు, జాయింట్ కలెక్టర్
ధాన్యం కొనుగోలుకు బ్రేక్
ధాన్యం కొనుగోలుకు బ్రేక్


