నేటి నుంచి మళ్లీ ఆధార్ ప్రత్యేక శిబిరాలు
తిరుపతి అర్బన్: విద్యార్థుల కోసం పాఠశాలల్లో మళ్లీ ఆధార్ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని గ్రామ,వార్డు సచివాలయాల జిల్లా అధికారి జీవీ నారాయణరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 86,141 మంది పిల్లలు ఆధార్లో బయోమెట్రిక్లను నవీకరించాల్సి ఉందన్నారు. అయితే గత నెల నవంబర్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఆధార్ ప్రత్యేక శిబిరాల్లో కేవలం 11,796 మందికి మాత్రమే బయోమెట్రిక్ నవీకరణ పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 16 నుంచి 20 వరకు, అలాగే ఈ నెల 22 నుంచి 24 వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నైపుణ్యాభివృద్ధితోనే ఆర్థిక స్వావలంబన
తిరుపతి రూరల్: నైపుణ్యాభివృద్ధితోనే మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించగలరని శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ ఉమ అన్నారు. విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రం తరఫున మూడు నెలల టైలరింగ్, అప్పేరల్ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమంతో పాటు హోమ్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేకరీ యూనిట్ను సోమవారం ఆమె ప్రారంభించారు.
భాషాప్రయుక్త రాష్ట్రానికి ఆద్యులు అమరజీవి
తిరుపతి అర్బన్: భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు అమరజీవి పొట్టిశ్రీరాములు ఆద్యులని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం అమరజీవి వర్ధంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో జరుపుకున్నారు. డీఆర్వో నరసింహులు, డీఆర్డీఏ పీడీ శోభన్బాబు, ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్కుమార్, డీఐపీఆర్ఓ గురుస్వామిశెట్టి పాల్గొన్నారు.
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం జరుగనుంది. స్థానిక అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు సభ్యులు హాజరై, దాదాపు 60 అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరుగనున్న వైకుంఠ ద్వార దర్శనాలను ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లపై చర్చించనున్నారు. అలాగే 100 ఎకరాల్లో దివ్యవృక్షాల ప్రాజెక్టుకు బోర్డు ఆమోదం తెలుపనుంది. అలాగే వసతిగృహాల నిర్మాణ పథకంలో దాతలకు అందిస్తున్న ప్రివిలైజేషన్లో నూతన పాలసీని తీసుకురాను న్నారు. రాష్ట్రంలో ఐదువేల ఆలయాలను శ్రీవాణి ట్రస్టు ద్వారా నిర్మించడానికి సంబంధించి సమగ్రమైన విధివిధానాలను రూపొందించడంతోపాటు నిధులను మంజూరు చేసే అవకాశం ఉంది.
తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2024–2025 వి ద్యాసంవత్సరానికి సంబంధించిన ఏపీ ఆర్ సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలు మొత్తం 65 సబ్జెక్టు లకు నిర్వహించగా, 5,164 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. మధుమూర్తి తెలిపారు. ఏపీ ఆర్సెట్ ఫలితాలను ఆయన ఆన్లైన్లో అధికారికంగా విడుదల చేశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ వి.ఉమ వర్చువల్గా హాజరయ్యారు. ఈ పరీక్షా ఫలితాల్లో సబ్జె క్టుల వారీగా పరిశీలిస్తే ఫార్మసీ విభాగంలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు కాగా, తరువాత స్థా నాల్లో మేనేజ్ మెంట్, కంప్యూటర్ సైన్స్ విభాగాలు నిలిచాయి. పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించిన మౌఖిక పరీక్ష వివరాలను త్వరలోనే ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామని ఏపీ ఆర్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష, కో– కన్వీనర్ ప్రొఫెసర్ జాన్ సుష్మ తెలిపారు. కాగా అభ్యర్థులు పరీక్షా ఫలితాలను ఏపీఆర్సెట్ వెబ్సైట్లో చూడవచ్చని ఆయన తెలిపారు.
నేటి నుంచి మళ్లీ ఆధార్ ప్రత్యేక శిబిరాలు


