
మమ్మల్ని ఆపేదెవడ్రా?
ఆక్రమణలకు గురవుతున్న భూములు
మామూళ్ల మత్తులో అధికారులు
తనపల్లి మార్గంలో
నదీ పరీవాహక ప్రాంతాన్ని పూడ్చివేస్తున్న దృశ్యం
సాక్షి ప్రతినిధి, తిరుపతి:తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. అందిన కాడికి అడ్డంగా దోచేస్తున్నారు. మామూళ్లకు అలవాటుపడ్డ అధికారులను బుట్టలో వేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలను పిండి చేస్తున్నారు. రాత్రీపగలు తేడాలేకుండా టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి మట్టి, గ్రావెల్, ఇసుక, సిలికా, క్వార్ట్జ్ను సరిహద్దులు దాటిస్తున్నారు. దగ్గర్లోని వెంచర్లకు తోలుతూ జేబులు నింపుకుంటున్నారు. ఇది చాలదన్నట్టు ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. అడ్డుచెప్పిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని తప్పుడు రికార్డులు సృష్టించి స్వాధీనం ప్రభుత్వ భూములు చేసుకుంటున్నారు. అటు కుప్పం నుంచి ఇటు గూడూరు వరకు వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.
చిత్తూరు కేంద్రంగా భారీగా గ్రానైట్ దందా సాగుతోంది. చిత్తూరు, బంగారుపాళెం, యాదమర్రి, పాలసముద్రం, వెదురుకుప్పం, శ్రీరంగరాజపురం, గంగాధరనెల్లూరు, కుప్పంలో కొండల్లోని గ్రానైట్ సంపదను కొల్లగొడుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ పరిధిలోని కుంట్రపాకం సర్వే నం.599 ఎగువ చెరువులోని బంక మట్టిని భారీ యంత్రాలతో తోడి ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చెరువులోని నీటిని కూడా ఇటుక బట్టీలకు వాడుకుంటున్నారు. రైతులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనుమరుగవుతున్న స్వర్ణముఖి
తిరుపతి రూరల్ మండలం, అవిలాల రెవెన్యూ వేదాంతపురం పంచాయతీ పరిధిలోని స్వర్ణముఖి నదిని యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. 2012 నుంచి 2019 వరకు సర్వే నం.504/7 నదీ పోరంబోకు భూమిలో ఇసుకను తోడి విక్రయించి ఆపై పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా స్వర్ణముఖి నది పూర్తిగా కనుమరుగైంది. ప్రస్తుతం ఉన్న కొద్ది పాటి నదిని సైతం పూడ్చివేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
కరిగిపోతున్న కొండలు..
గుంతలమయంగా స్వర్ణముఖి
కరిగిపోతున్న అంజేరమ్మ కనం..
వడమాలపేట మండల పరిధిలోని అంజేరమ్మ ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ కరిగిపోతోంది. ఇప్పటికే ఆలయం వెనుక ఉన్న కొండను యంత్రాలతో తొలిచి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భూమిని చదునుచేసుకున్నారు. ప్రస్తుతం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సిద్ధం చేశారు. అదే విధంగా ఆలయం వెనుక ఉన్న కొండను తవ్వి గ్రావెల్ను తరలించకపోవడంతో పాటు.. ఆక్రమించి మామిడి చెట్లు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ అక్రమాలు స్థానిక అధికారులకు తెలిసినా మామూళ్ల పుచ్చుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మమ్మల్ని ఆపేదెవడ్రా?

మమ్మల్ని ఆపేదెవడ్రా?