
పడకేసిన పల్లె వైద్యం
తిరుపతి తుడా : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసింది. కొన్ని రోజుల నుంచి పీహెచ్సీలో పనిచేస్తున వైద్యుల సమస్యలను పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి వైద్యులు సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో వైద్య సేవలు స్తంభించిపోయాయి. దీంతో జిల్లాలోని పలు పీహెచ్సీలు సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేశారు. అత్యవసర సేవలు మాత్రం అక్కడక్కడా కొనసాగాయి. నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. ఆన్లైన్ సేవలు, రిపోర్టుల సమర్పణకు బంద్ పాటించారు. దీంతో పలు సేవలు స్తంభించాయి. పలుచోట్ల ప్రజలు చికిత్స అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది.
జిల్లా వ్యాప్తంగా సేవలకు మంగళం
ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ వైద్యుల సంఘం (ఏపీపీహె చ్పీడీఏ) పిలుపు మేరకు వైద్యులు సమ్మెబాట పట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో వైద్య సేవలు స్థంభించి పోయాయి. గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి రూరల్ ప్రాంతాలలోని పీహెచ్సీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పీహెచ్సీలకు విచ్చేసిన రోగులు తమకు ఇదివరకు ట్రీట్మెంట్ ఇచ్చిన వైద్యులు లేకపోవడంతో వెనుదిరిగారు. దీంతో పీహెచ్సీలలో పనిచేస్తున్న నర్సులు సైతం డాక్టర్లు లేరని తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు.
ఎస్వీ మెడికల్ కళాశాల నుంచి 53 మంది వైద్యులు
జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీలలో వైద్యులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మెకు దిగడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. ఎస్వీ మెడికల్ కళాశాల నుంచి 53 మంది వైద్యులను, డీసీహెచ్ విభాగం నుంచి సుమారు 36 మంది వైద్యులను జిల్లాలోని అన్ని పీహెచ్సీ ఆసుపత్రులకు తాత్కాలికంగా విధులు నిర్వహించాలని పంపారు. కానీ కనీసం 3 0శాతం మంది వైద్యులు తమకు విధులు కేటాయించిన ఆసుపత్రులకు వెళ్లలేకపోవడంతో రోగులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో వైద్యశాఖాధికారులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమకు సుదూర ప్రాంతాలలో విధులు కేటాయించి ఎటువంటి మౌలిక సదుపాయాలు కేటాయించలేదని వారు వాపోతున్నారు.
104 పై ప్రభావం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సమ్మె బాట పట్టడంతో 104 వైద్య సేవలపై ప్రభావం కనిపించింది. పీహెచ్ సీల్లో ఇద్దరు వైద్యులు ఉండగా ఒకరు ఆరోగ్య కేంద్రంలో, మరొకరు 104 సంచార వైద్య సేవలు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. సమ్మె కారణంగా వైద్యులు విధులకు రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని అప్పట్లో కూటమి నేతలు, అధికారులు చెప్పారు. తీరా నిరసన విరమించాక ఏమాత్రం పట్టించుకోలేదు. చంద్రన్న సంచార చికిత్స వాహనంలో తిరిగీ సేవలందిస్తున్నందుకు ప్రతి నెలా అదనంగా రూ.5 వేలు చెల్లించాలని కోరుతున్నారు. అందించకపోవడంతో 104 వైద్య సేవలు ఆగిపోయాయి. ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా మిగిలిన అన్ని పీహెచ్సీల పరిధిలో 104 వైద్య సేవలకు ఆటంకం కలిగింది. ప్రభుత్వం స్పందించి వైద్యుల డిమాండ్లు పరిష్కరిస్తే గానీ పేదలకు వైద్య సేవలు అందే అవకాశం కానరావడంలేదు. సీజన్ వ్యాధులు వ్యాపించే పరిస్థితుల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుల డిమాండ్లు ఇవీ....
సర్వీస్లో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు గతంలో 30 శాతం క్లినికల్ 50 శాతం నాన్ క్లినికల్ రిజర్వేషన్ ఉప డేది. ప్రస్తుం ఈ కోటాను 15.30 శాతానికి కుదించారు.
ఈ ఏడాది జీఓ నంబర్ 89 ద్వారా ఆరు బ్రాంచ్ల నిబంధన తెర మీదకు తెచ్చారు. దీని ప్రకారం 15 శాతానికి కుదించిన క్లినికల్ సీట్ల రిజర్వేషన్ రేడియాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, అనస్థీషియా బ్రాంచీలకు మాత్రమే వర్తింపజేసింది. ఈ అన్యాయాన్ని వైద్యులు ఏడాది కాలంగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు.
ఎంబీబీఎస్ చదివి వైద్యాధికారిగా నియమితులైన వారు పీజీ చదువుకోవడానికి ప్రభుత్వం అనేక షరతులు పెట్టింది. రూ.50 లక్షల ష్యూరిటీ ఇవ్వాలని, కనీసం పదేళ్లు ప్రభుత్వ సర్వీసులో అదే హోదాలో పని చేస్తామంటూ బాండ్ రాయాలని చెబుతోంది.
మెడిసిన్ చదివినా ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా ప్రభుత్వం తన వద్ద హామీగా పెట్టుకుంటోంది.దీనిపై వైద్యవృత్తిలో ఎదుగుదల లేదంటే పీజీ చదవడం దేనికని పీహెచ్సీల వైద్యులు ప్రశ్నిస్తున్నారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేస్తున్న ఎంతో మంది వైద్యాధికారులకు 20 ఏళ్లుగా పదోన్నతులు లేవు. వారికి పదోన్నతులు కల్పిస్తామని ఎన్నికల వేళ అసోసియేషన్ నాయకులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని వైద్యులు ఆరోపిస్తున్నారు.

పడకేసిన పల్లె వైద్యం

పడకేసిన పల్లె వైద్యం