
ముగిసిన డిగ్రీ రెండవ విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ
తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో రెండవ విడత డిగ్రీ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఓఏఎమ్డీసీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శుక్రవారంతో ముగిసినట్లు తెలిపింది. విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి సాధించిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈనెల 6వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 7, 8వ తేదీలలో ఆయా కళాశాలల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలను సమర్పించి అడ్మిషన్లు పొందాలని సూచించారు. రెండవ విడత అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.
నేటితో ముగియనున్న పీజీ ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్
తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో పీజీసెట్–2025 రెండవ విడత (ఫైనల్ ఫేజ్) అడ్మిషన్ల ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఈ మేరకు ఇప్పటికే ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. రెండవ, చివరి విడత అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ఆయా కోర్సులకు సంబంధించి ఈనెల 6వ తేదీన వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించారు. అనంతరం పీజీ సెట్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రిజర్వేషన్లు, సాధించిన మార్కుల ఆధారంగా 8వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఈనెల 11వ తేదీలోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లకు త్వరలో స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు.
జాతిపిత అడుగు జాడల్లో పయనిద్దాం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధీ జయంతి సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాలను రెండు వారాలు పాటు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారని తెలిపారు. ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛత అంశాలలో ఒక కొత్త అంశం తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాలు, నగరాలను స్వచ్ఛ ప్రాంతాలుగా తీర్చిదిద్దాలనేది కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. అంతక ముందు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) నరసింహులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తిరుపతి నగరపాలక కమిషనర్ మౌర్యతో పాటు మున్సిపల్ అధికారులు, ఏవో రమేష్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు
తిరుపతి సిటీ : వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఆర్ఐఓ రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. 23న ఫస్ట్ ఇయర్ పరీక్షలు, 24న ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. సాధారణ, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి టైం టేబుల్ విడుదల చేశారని ఆయన తెలిపారు.
గజలక్ష్మి నమో నమామి
చంద్రగిరి : విజయదశమి సందర్భంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు గురువారం గజ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. విజయదశమి పర్వదినం పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. విద్యుత్ దీపాల కాంతుల నడుమ అమ్మవారికి ఊంజల్సేవను కనుల పండువగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనంపై ఆశీనులై నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

ముగిసిన డిగ్రీ రెండవ విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ