
నీటి గుంతలో పడి యువకుడి మృతి
చిల్లకూరు : గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో బుధవారం ఓ యువకుడు నీటి గుంతలో పడి మృతి చెందాడు. వివరాలు.. స్థానిక రాణీ పేటకు చెందిన అత్తివరం, రవీంద్ర (23) కొంత మంది స్నేహితులతో కలసి అండర్ బ్రిడ్జి వద్ద గుంతలో ఈతకొట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మనోజ్కుమార్ తెలిపారు.
బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
పాకాల : మండలంలోని దామలచెరువులో బుధవారం బస్సు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. వివరాలు.. మొగరాల పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన రఘు(63) రోడ్డు దాటుతుండగా పీలేరు నుంచి చిత్తూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో రఘు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు బోల్తా పడి ఒకరి మృతి
తిరుపతి రూరల్ : మండలంలోని చిగురువాడ వద్ద స్వర్ణముఖినదిలో కారు బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. చిత్తూరు జిల్లా, వెదురుకుప్పం మండలం, కిచ్చమనాయుడుపల్లెకు చెందిన కంకలపాటి మురళి (42) తిరుపతిలో నివసిస్తున్నాడు. అయితే వ్యాపారం రీత్యా కార్వేటినగరంలో ప్రొవిజన్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. నిత్యం తిరుపతి నుంచి కార్వేటినగరానికి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కారులో తిరుపతికి వస్తుండగా చిగురువాడ బ్రిడ్జి వద్ద టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి స్వర్ణముఖి నదిలోకి దూసుకు వెళ్లింది. అదే సమయంలో అటుగా వచ్చిన కేసీపేట సర్పంచ్ పినాకపాణి మరికొందరి సాయంతో మురళిని బయటకు తీసి 108లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నీటి గుంతలో పడి యువకుడి మృతి

నీటి గుంతలో పడి యువకుడి మృతి

నీటి గుంతలో పడి యువకుడి మృతి