
విద్యార్థిపై హత్యాయత్నంలో 11 మంది అరెస్టు
చంద్రగిరి : ఇద్దరి విద్యార్థులు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో మరొక విద్యార్థి జీర్ణించుకోలేక మరో విద్యార్థిపై తన స్నేహితులతో కలసి హత్యాయత్నానికి పాల్పడ్డారని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 2న తిరుచానూరులోని నేతాజీ నగర్లో నివాసం ఉంటున్న దినేష్పై హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు హత్యాయత్నానికి పాల్పడిన వారిని గుర్తించి, తిరుచానూరు పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న దినేష్, వీవీ నగర్కు చెందిన కుహల్ ఇద్దరూ ఒకే యువతిని ప్రేమించడంతో సెప్టెంబర్ 24న ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయన్నారు. ఈ క్రమంలో కుహల్ ఫోన్ ద్వారా దినేష్ను తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసిందన్నారు. అనంతరం అదే రోజు రాత్రి కుహల్ మరి కొంత మంది మిత్రులను పిలిపించుకుని సింధూ సర్కిల్ సమీపంలో మద్యం సేవించారని, ఆపై దినేష్ నివాసానికి వెళ్లారన్నారు. ఇంట్లో ఉన్న దినేష్పై దాడికి పాల్పడి బయటకు తీసుకొచ్చి కత్తితో దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దినేష్ అక్కడే కుప్పకూలి పడిపోవడంతో, స్థానికులు తిరుపతి రుయాకు తరలించినట్లు చెప్పారు. బాధితుడు దినేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మంగళవారం 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. వీరిలో కుహల్, గుణసాగర్, అజిత్ నాయక్, మహేష్, తేజ సాయి, చాణక్య, అనిల్, పూర్ణ చంద్, వినయ్, విష్ణును అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి హత్యాయత్నానికి ఉపయోగించిన బటన్ కత్తి, సురకత్తి, మచ్తు కత్తితో పాటు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నట్లు చెప్పారు. అనంతరం నిందితులను తిరుపతి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించడంతో ప్రతిభ కనబరిచిన సీఐ సునీల్ కుమార్, ఎస్ఐలు జగన్నాథ రెడ్డి, అరుణ, క్రైం పార్టీ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.