
తిరుమలలో శాస్త్రోక్తంగా చక్రస్నానం
తిరుమల: అనంత పద్మనాభవ్రతం సందర్భంగా తిరుమలలో శనివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామివారి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకాలు చేశారు. అనంతరం చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.