
పచ్చముఠా దోపిడీ
● ఇష్టారాజ్యంగా ఇసుక, గ్రావెల్, బండరాళ్ల తరలింపు ● రాజుపాళెంలో యథేచ్ఛగా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు
సాక్షి టాస్క్ఫోర్స్ : వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, బండరాళ్లు అక్రమంగా తరలిస్తూ సహజ సంపద లూటీ చేస్తున్నారు. ఓ నేత కనుసన్నల్లో పచ్చ మాఫియా చెలరేగిపోతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సహజ సంపద గుల్ల చేసి రూ.కోట్ల సొమ్ము వెనుకేసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం రాజుపాళెం సమీపంలోని పెన్నా నదిలో ఇసుక తవ్వకాలకు ప్రధానంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వలేదు. కానీ తమ్ముళ్లు ఇసుక రేవుల్లో పడి దొరికందంతా దోచేస్తున్నారు. దీనికి తోడు పెన్నాలో నీటి ప్రవాహంలో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అక్కడ లభించే పెద్ద పెద్దరాళ్లతో పాటు గ్రావెల్ను సైతం నిర్భయంగా తరలించుకుపోతున్నారు.
రీచ్లకు పుల్ స్టాప్..
అయినా ఆగని అక్రమ రవాణా
నెల్లూరు జిల్లాలోని ఇసుక రీచ్లను అక్టోబర్ 15 వరకు అనుమతులను అధికారులు రద్దు చేశారు. కానీ ఉన్నతాఽధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులు రాజుపాళెం రీచ్లో ఇసుక అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. ఇదంతా కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు చేసి యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి నిత్యం సగటున వంద వాహనాల్లో ఇసుకను ఇతర రాష్ట్రాలకు పగలు, రాత్రి లేడా లేకుండా తరలిస్తూ దోపిడీ సాగిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ , మైనింగ్ అధికారులు ఈ అక్రమార్జనలో భాగస్వాములయ్యారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
నదిలోకి రాచబాట
పర్యావరణానికి తూట్లు పొడుస్తూ పెన్నానదిలోకి ఇసుకాసురులు రాచబాట వేశారు. తెలుగురాయపురానికి ప్రధాన రహదారి నుంచి నది మధ్యలోకి రోడ్డు వేశారు. రాజుపాళెంలోకి ప్రధాన రహదారి నుంచి ప్రైవేటు వ్యక్తికి చెందిన మామిడి తోట నుంచి రోడ్డును నిర్మించారు. ఆ రహదారి వేసేందుకు ఆ ప్రైవేటు వ్యక్తికి నెలకు రూ. 50 వేలు ముట్టచెబుతున్నారు. నది గర్భంలోకి రోడ్డు వేసినా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడంలేదు. అధికార పార్టీ నేతల సహకారంతో పచ్చ మాఫియా నదిలో ఇసుక, గ్రావెల్, బండరాళ్లు దోపిడీ చేస్తుంటే అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.