
‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు
తిరుపతిలోని పెట్రోల్ బంక్
లిట్మస్ పరీక్షా...ఎక్కడ..?
సాధారణంగా పెట్రోలు నాణ్యతపై వినియోగదారులకు ఏమైనా సందేహాలు ఉంటే లిట్మస్ పేపర్తో పరీక్ష చేసి చూపాలి. ఈ పరీక్షలో నలుసులు, దుమ్ము సైతం కనిపించకుడదు. అయితే ఆ పరీక్షను చేసేవారు లేరు. చాలమందికి ఆ పరీక్షపై సరైన అవగాహన లేకపోవడం గమనార్హం.
తిరుపతి అర్బన్/తిరుపతి సిటీ:జిల్లావ్యాప్తంగా మోటా రు వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యులు సైతం బైక్ లేనిదే ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఈ–బైక్లు అందుబాటులో కి వచ్చినా ప్రజలు ఇప్పటికీ పెట్రోల్తో నడిచే ద్విచక్రవాహనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వినియోగదారుల అవసరాలను పెట్రోల్ బంకుల నిర్వాహకులు అవకాశంగా మార్చుకుంటున్నారు.
జంప్ ట్రిక్!
జిల్లాలో 90 పెట్రోల్ బంకులు ఉన్నాయి. కొన్ని బంకుల్లో ‘జంప్ ట్రిక్’ మోసానికి పాల్పడుతున్నారు. పెట్రోల్ పట్టేప్పుడు అక్కడి సిబ్బంది డిజిటల్ మీటర్లో జీరో చూసుకోండి అని చెబుతుంటారు. పెట్రోల్ పోయడం మొదలుపెట్టగానే మీటరు నెమ్మదిగా పెరగకుండా ఒక్కసారిగా 10–20 పాయింట్లకు వెళ్లిపోతుంది. దీంతో మనకు తక్కువ పెట్రోల్ పోసినా, మీటరులో కరెక్ట్గా ఉన్నట్టే చూపిస్తుంది. సాధారణంగా మీటరు 4–5 పాయింట్లు మాత్రమే జంప్ అవ్వాలి. జిల్లాలోని అనేక బంకుల్లో ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇది గమనించి అడిగినా.. పెట్రోల్ బంకు సిబ్బంది నుంచి స్పందన లేదని వాహనచోదకులు మండిపడుతున్నారు.
వసతులు కరువు
పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులకు కనీస వసతులు కల్పిండం లేదు. నిబంధనల ప్రకారం ప్రతి బంకు వద్ద మరుగుదొడ్లు, ఉచితంగా గాలి పట్టే పంపులు, తాగునీటి సదుపాయాలు కల్పించాల్సి ఉంది. 20 శాతం బంకుల్లో మినహా మిగిలిన చోట్ల అస్సలు సౌకర్యాలే ఉండడం లేదు. కనీసం జాతీయ రహదారి వెంబడి ఉన్న బంకుల్లోనూ తూతూమంత్రంగా వసతులు ఉన్నాయని వాహనాదారులు విమర్శిస్తున్నారు.
కనీస వసతులు లేని మల్లవరం పెట్రోల్ బంక్
పెట్రోల్ బంకుల్లో యథేచ్ఛగా చీటింగ్
దోపిడీ గన్తో రీడింగ్ మాయ
కల్తీ ఇంధనంతో వాహనదారులకు ఝలక్
లిట్మస్ పరీక్ష అడిగితే ససేమిరా
అంటున్న సిబ్బంది
తూతూమంత్రంగా తనిఖీలు చేపడుతున్న అధికారులు
జిల్లావ్యాప్తంగా కొరవడిన పర్యవేక్షణ
కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు కేవలం రెండే కేసులు
డిజిటల్ మీటర్ నుంచి ఆయిల్ నాణ్యత వరకు అవకతవకలే
తిరుచానూరు రోడ్డులోను ఓ పెట్రోల్ బంకులో తక్కువ ఇంధనం పడుతున్నట్లు నాగలక్ష్మి అనే వాహనదారు తెలిపారు.
తిరుపతి అలిపిరి రోడ్డులోని ఓ బంక్లో పెట్రోల్ పడితే 10–15 కిలోమీటర్లకు ముందే రిజర్వ్ పడిందని దామోదర్ అనే ద్విచక్రవాహనదారుడు వాపోయారు.
తిరుపతి లీలామహల్ రోడ్డులోని ఓ బంక్కు వెళ్లి వాటర్ బాటిల్లో లీటర్ పెట్రోల్ పడితే 950 మిల్లీలీటర్లే ఉందని మరో బాధితుడు రమేష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ ప్రాంతంలోని హైవేపై బంకుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పలువురు వాపోతున్నారు.
శ్రీకాళహస్తిలో వాటర్ బాటిల్లో పట్టుకుంటే లీటర్కు 50 మిల్లీలీటర్లు తక్కువ ఉంటోందని, అదే వాహనానికి అయితే లీటర్కు 100 మిల్లీలీటర్ల తగ్గించి పడుతున్నారని బాలాజీ అనే మోటారుసైకిలిస్టు ఆరోపించారు.
వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట,సత్యవేడు నియోజకవర్గాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇదే విధంగా మోసాలకు పాల్పడుతున్నారని వాహనదారులు మండిపడుతున్నారు.
వెంటనే చర్యలు
పెట్రోల్ బంకుల్లో మోసాలు, వసతులకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే చర్యలు చేపడుతున్నాం. ఆయా పెట్రోల్ బంకులను తనిఖీలు చేస్తున్నాం. మండలస్థాయి సివిల్ సప్లయి అధికారులను నిత్యం పెట్రోల్ బంకులపై నిఘా పెట్టమని చెప్పాం. తరచూ తనిఖీలు చేపడుతున్నాం. వినియోగదారులకు సమస్య వస్తే మా దృష్టికి తీసుకురావాలి. తప్పు చేసిన పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకుంటాం.
– శేషాచలం రాజు, జిల్లా సివిల్ సప్లయి అధికారి
తనిఖీలు చేస్తున్నాం
పెట్రోల్ బంకులపై ఫిర్యాదులు వచ్చినా రాకున్నా తరచూ తనిఖీలు చేస్తున్నాం. తొమ్మిది నెలల్లో 200 సార్లు తనిఖీలు చేపట్టాం. రెండు కేసులు నమోదు చేశాం. వారికి రూ.1.5లక్షల జరిమానా విధించాం. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే ఆ పెట్రోల్ బంకులపై ప్రత్యేక నిఘా పెడతాం. కొందరు వాటర్ బాటిల్లో పట్టుకుంటే తేడా లేదని..వాహనానికి పట్టుకుంటే తేడా ఉన్నట్లు చెబుతున్నారు. ఏదైనా ఒకేలా ఉంటుంది...అలాంటి తేడాలు ఉండవు. – సి.స్వామి, కొలతలు,
తూనికల శాఖ జిల్లా సహాయ కమిషనర్
సార్.. జీరో చూసుకోండి!
సాధారణంగా వాహనదారులు పెట్రోల్ బంకుకు వెళ్లి.. ఇంధనం పోయాలని అక్కడికి సిబ్బందికి ఆడిగిన వెంటనే... వారు సార్ ‘జీరో చూసుకోండి’ అని ఎంతో నమ్మకంగా చెబుతారు. మన దృష్టి కూడా ఆ ‘సున్నా’పైనే ఉంటుంది. జీరో ఉన్నంత మాత్రాన మనం మోసపోమనుకుంటే అది పొరపాటే. బంకుల్లో ఎప్పటికప్పుడు నయా మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వినియోగదారులు నష్టపోతూనే ఉన్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం.. వినియోగదారులు సైతం దీనిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో జిల్లాలో పెట్రోల్ బంకుల నిర్వాహకులు యథేచ్చగా దోపిడీకి తెరతీస్తున్నారు.
ఫిర్యాదు ఇలా..
పెట్రోల్ బంకుల్లో మోసాలు గమనిస్తే నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయవచ్చు. సదరు మండలంలోని సివిల్ సప్లయ్ అధికారి లేదా, జిల్లా సివిల్ సప్లయి అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే తూనికలు,కొలతల అధికారులకు సమాచారం అందించవచ్చు. అయినప్పటికి న్యాయం జరగకపోతే జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. పెట్రోల్ బంకుల్లో సదుపాయాలు లేకపోయినా, సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన చమురు సంస్థలకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు

‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు

‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు

‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు

‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు

‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలు