తిరుపతి మంగళం : అటవీ ప్రాంతంలో నుంచి బయటకు వస్తున్న మద గజాలను కుంకీ ఏనుగులతో కట్టడి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్కుమార్ నాయక్ ఆదేశించారు. ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శనశాలలోని ఎలిఫెంట్ క్యాంపును ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పలమనేరులోని క్యాంపుతో పాటు జూ పార్కును కూడా కుంకి ఏనుగుల నిర్వహణకు వినియోగించుకోవాలని సూచించారు.
శిక్షణ పొందిన ఏనుగులను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. గజ దాడులలో ఒక్కరు కూడా మృత్యువాత పడకుండా, పంట పొలాలు నాశనం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే జూ పార్క్ లోని వన్యప్రాణుల స్థావరంలో పరిశుభ్రతను మెరుగుపరచాలన్నారు. అనంతరం జంతువుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. జూలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంవలో తిరుపతి సీఎఫ్ సెల్వం, అనంతపురం సీఎఫ్ యశోదాబాయి పాల్గొన్నారు.