
7 నుంచి ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు
వడమాలపేట (విజయపురం) : వడమాలపేట మండల అప్పలాయిగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి శివకుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 6న అంకురార్పణ జరిపించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవదేవేరులు విశిష్ట వాహనాల్లో విహరించనున్నట్లు చెప్పారు. 10వ తేదీ నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనదలచిన దంపతులు రూ.500లు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు.
పోలీస్ గ్రీవెన్స్కు 74 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 74 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్ధన్న్రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు,ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదే వీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీ లు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరింది. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,538 మంది స్వామివారిని దర్శించుకోగా 37,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
తిరుపతికి ప్రత్యేక రైళ్లు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని తిరుపతి రైల్వే స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు. భక్తుల రద్దీని పరిగణనలోకి తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయినట్లు చెప్పారు. ఈ మేరకు ఉన్నతాధికారుల సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేపట్టామన్నారు. తాత్కాలికంగా నడిపిస్తున్న ప్రత్యేక రైళ్ల ద్వారా, భక్తులు సులభంగా రైలు టికెట్లు పొందవచ్చని తెలిపారు.
ఏం చేయాలబ్బా!
● మినీ మహానాడుకు నియోజకవర్గం నుంచి యాభై వాహనాలు
● తలలు పట్టుకుంటున్న రవాణాశాఖ అధికారులు
తిరుపతి మంగళం: టీడీపీ మినీ మహానాడు రవాణాశాఖకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వాహనాలను మినీ మహానాడు సభలకు పంపించాలంటూ కూటమి ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు రవాణాశాఖ అధికారులకు హుకుం జారీ చేసినట్టు సమాచారం. గతంలో సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు మంత్రుల కాన్వాయ్లకు ఏర్పాటు చేసిన బకాయిలను ప్రభుత్వం చెల్లించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ టీడీపీ మినీ మహానాడు సభలకు వాహనాలను పెట్టమని యజమానులను అడిగేందుకు రవాణాశాఖ జంకుతోంది. ఏం చేయాలో దిక్కుతోచక రవాణాశాఖ అధికారులు నానా అవస్థలు పడుతున్నట్లు సమాచారం.
రుణాలకు తొలి ప్రాధాన్యం
తిరుపతి అర్బన్: రైతులతోపాటు పేదలందరికీ బ్యాంక్ రుణాల విషయంలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వెంకటేశ్వర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ శ్రీనివాసకుమార్, తిరుపతి రీజనల్ మేనేజర్ సోమంచి శర్మ, లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికుమార్ మర్యాదపూర్వకంగా కలెక్టర్తోపాటు జేసీ శుభం బన్సల్ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎక్కువ మందికి బ్యాంక్ రుణాలు ఇప్పించేలా కృషి చేయాలని సూచించారు.

7 నుంచి ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు

7 నుంచి ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు