![డీవైఈఓ పరీక్షకు పటిష్ట భద్రత](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/25/24tpl55-300079_mr.jpg.webp?itok=-0_a5rkE)
తిరుపతి అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతృత్వంలో శనివారం నిర్వహించనున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ స్క్రీనింగ్ పరీక్షకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు డీఆర్ఓ పెంచల కిషోర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఆర్ఓ మాట్లాడుతూ అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి 8.30 గంటల లోపు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. జిల్లాలోని 11 కేంద్రాల్లో 9 నుంచి 11.30 గంటల వరకు ఆబ్జెక్టివ్ టైప్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షకు 840 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఆలస్యంగా వస్తే పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదని, కేవలం హాల్ టికెట్, గుర్తింపు కార్డు, వాటర్ బాటిల్ను మాత్రమే లోపలికి తీసుకెళ్లాలని తెలిపారు. అభ్యర్థుల మొబైలు ఫోన్లను డిపాజిట్ చేసుకునేందుకు తగు ఏర్పాట్లు చేయాలని కోరారు.