హైదరాబాద్ వ్యాపారులకు కర్ణాటక మంత్రి వత్తాసు
రైతుకు రూ.1.89 కోట్లు బాకీ పడిన నిందితులు
వదిలేయాలని పోలీసులకు ఫోన్
కర్నాటక రాష్ట్రం: రైతుకు డబ్బులు ఎగ్గొట్టిన హైదరాబాద్ వ్యాపారులకు మద్దతుగా కర్ణాటక మంత్రి ఫోన్ చేయడం వైరల్ అయ్యింది. బెంగళూరు సమీపంలో చిక్కబళ్లాపురం వద్ద పెరేసంద్ర గ్రామంలో జొన్నల వ్యాపారి రామక్రిష్ణప్ప హైదరాబాద్లోని అబ్దుల్ రజాక్, అక్బర్ బాషా, నసీర్ అనే దళారులకు జొన్నల లోడ్లను పంపారు. ఇందుకుగాను రూ. 1.89 కోట్లు వారు దళారీ రామక్రిష్ణప్పకు చెల్లించాల్సి ఉంది. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితుడు పేరేసంద్ర ఠాణాలో ఫిర్యాదు చేయడంతో సబ్ ఇన్స్పెక్టర్ జగదీశ్రెడ్డి కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో ఉంటున్న అక్బర్ను ఠాణాకు తీసుకు వచ్చారు.
నేను సెటిల్ చేస్తా..
ఇక్కడే కథ మలుపు తిరిగింది. సదరు వ్యాపారిని సీఐ విచారిస్తుండగా గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ఖాన్ ఆఫీసు నుంచి అతడి సహాయకుడు లక్ష్మీనారాయణ ఠాణాలోని సిబ్బందికి కాల్ చేసి, మంత్రి మీతో మాట్లాడతారని ఫోన్ మంత్రికి ఇచ్చారు. దీంతో లైన్లోకి వచ్చి మంత్రి జమీర్ అహ్మద్ సమస్తే బ్రదర్, హైదరాబాద్లో ఉంటున్న మన బంధువు అక్బర్ ఇక్కడ ఎవరికో డబ్బులు ఇవ్వాలని తీసుకువచ్చారట, ఏమి కేసు అది? అని అడిగారు.
దీనిపై ఎస్ఐ జగదీశ్రెడ్డి స్పందిస్తూ ఇక్కడ జొన్నల వ్యాపారికి డబ్బులు ఇవ్వాలని, అందుకు సంబంధించి రికార్డులు ఉన్నాయని, వారి పైన ఎఫ్ఐఆర్ నమోదైనందున వారిని తీసుకువచి్చనట్లు చెప్పాడు. దీంతో మంత్రి మాట్లాడుతూ అది అంత మొత్తం కాదు, కూర్చుని సెటిల్మెంట్ చేసుకుంటారట, మేము ఆ పని చేస్తాము, మీరు వారిని వదిలిపెట్టండి అని సూచించారు. ఈ ఆడియో వైరల్ అయింది. బాధితుడు రామక్రిష్ణప్ప మాట్లాడుతూ రైతులకు సహాయం చేయాల్సిన మంత్రి ఇలా చేస్తే ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ధర్నా చేపడతామని పేర్కొన్నాడు.


