మేడ్చల్ జిల్లా: నిశ్చయమైన పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మేడిపల్లి పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన బక్కతట్ల మునిత కుటుంబంతో కలిసి మేడిపల్లికి వలస వచ్చి సీపీఆర్ఐ సమీపంలో భార్యభర్తలిద్దరూ వాచ్మెన్గా పనిచేస్తున్నారు.
వీరి పెద్ద కుమార్తె మమత(18) డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా, మమతకు మహబూబాబాద్కు చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించి మే 13న వివాహ ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే ఉన్నత చదువులు చదువుకుంటానని, ఇప్పుడే వివాహం వద్దని మమత నిరాకరించినప్పటికీ తల్లిదండ్రులు బలవంతం చేశారు. ఈ నెల 23న సాయంత్రం కుటుంబమంతా కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైంది. మమత బాత్రూమ్కు వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచి్చన చెల్లెలు వైష్ణవి తలుపు తట్టింది.
స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా మమత చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ సోమవారం తెల్లవారుజామున మమత చనిపోయింది. మృతురాలి తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


