
పెద్దపల్లి జిల్లా ఊశన్నపల్లిలో అడ్డుకున్న గ్రామస్తులు
ప్రభుత్వ బడికే పిల్లలను పంపాలని తల్లిదండ్రులకు వినతి
కాల్వశ్రీరాంపూర్ (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊశన్నపల్లిలో శుక్రవారం ప్రైవేటు స్కూళ్ల బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ఊరికి ప్రైవేటు స్కూల్ బస్సులు రావద్దని, గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు. ఉదయం స్కూల్ బస్సులు వచ్చే సమయానికి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గుమికూడిన కొందరు గ్రామస్తులు.. బస్సులు ఎక్కుతున్న పిల్లలను దించివేశారు. దీంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకున్నారు.
పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్య ఈ విషయాన్ని ఎంఈఓ మహేశ్కు తెలపటంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న పిల్లల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపించాలని కోరారు. అనుమతులు లేకుండా పిల్లలను తరలిస్తున్న వ్యాన్ల డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊశన్నపల్లి పాఠశాల ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ, విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, కలెక్టర్ చేతుల మీదుగా ‘బెస్ట్ స్కూల్’‘ఛాంపియన్ స్కూల్’అవార్డులు పొందారని ఎంఈఓ గుర్తు చేశారు. తల్లిదండ్రులు నిజం తెలుసుకొని తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపాలని కోరారు.