కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనే విమోచన ఉత్సవాలు | Union Minister Gajendra Singh Shekawat will attend the ceremony at the Parade Grounds on sep 17 | Sakshi
Sakshi News home page

కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనే విమోచన ఉత్సవాలు

Sep 14 2024 4:57 AM | Updated on Sep 14 2024 4:57 AM

Union Minister Gajendra Singh Shekawat will attend the ceremony at the Parade Grounds on sep 17

17న పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకలకు రానున్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

హాజరుకానున్న కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడాన్ని తప్పుబడుతున్న బీజేపీ

విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా హైదరాబాద్‌ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. రెండేళ్లక్రితం సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తొలిసారిగా ఈ ఉత్సవాలను కేంద్రం అధికారికంగా నిర్వహించినపుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుకలకు అమిత్‌షా హాజరవుతారని రాష్ట్ర పార్టీ నేతలు గట్టిగా విశ్వసించారు. అయితే ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన విమోచన వేడుకలు నిర్వహించనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. గతేడాది కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా చారిత్రక గోల్కొండ కోటలో సైనికదళాల పరేడ్‌తో పాటు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన విషయం విదితమే.

ఈ ఏడాది కూడా కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం... పారా మిలటరీ దళాలు, సైనిక దళాలు పరేడ్‌ను నిర్వహించనున్నాయి. హైదరాబాద్‌ సంస్థానం విముక్తి కోసం జరిగిన పోరాటానికి సంబంధించిన చారిత్రక అంశాలతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను కళాకారులు ఇవ్వనున్నారు. 

ఇదిలా ఉంటే...17న హైదరాబాద్‌ విమోచన సందర్భాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడాన్ని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 17న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడాన్ని కేంద్రమంత్రి సంజయ్, బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. 17న రాష్ట్ర ప్రభుత్వమే విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు బీజేపీ శాసనసభాపక్షం సిద్ధమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement