TS TET 2022: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్‌ పరీక్ష..

TS TET 2022 Exam, Must Know And Follow This Guidelines - Sakshi

హైదరాబాద్‌ పరిధిలో 83,465 మంది అభ్యర్థులు  

సాక్షి, హైదరాబాద్‌:  ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రారంభమైంది. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 336 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 83,465 మంది పరీక్షకు హాజరు కానున్నారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 212 పరీక్ష కేంద్రాలున్నాయి. రాజ ధానిలో మొత్తం 50,600 మంది పరీక్ష రాస్తున్నారు. ములుగులో అతి తక్కువగా 15 పరీక్ష కేంద్రాలున్నాయి. ఈ జిల్లాలో దాదాపు 2,200 మంది పరీక్ష రాస్తున్నారు.

ప్రతి కేంద్రానికి 11 మంది ఇన్‌విజిలేటర్లు
పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రతి కేంద్రానికి 11 మంది ఇన్‌విజిలేటర్లు, మరో ముగ్గురు పర్యవేక్షణ అధికారుల చొప్పున వినియోగిస్తున్నారు. వారికి  పరీక్ష నిర్వహణ విధానంపై శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. వీటిని ఇంటర్నెట్‌ ద్వారా జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేశారు. ప్రశ్నపత్రం ఓపెన్‌ చేయడం మొదలు కొని, ప్యాక్‌ చేసే వరకూ వీడియో రికార్డింగ్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

పేపర్‌– 1 అభ్యర్థులకు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, పేపర్‌– 2 అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, తాగునీరు, నిరంతర విద్యుత్‌ సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయానికి కేంద్రాలకు అభ్యర్థులు  చేరుకునే విధంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి.  

పరేషాన్‌లో అభ్యర్థులు.. 
టెట్‌ హాల్‌ టికెట్లు తప్పుల తడకగా మారడంతో అభ్యర్థులు పరేషాన్‌ అవుతున్నారు. ఇప్పటికే కొందరు హాల్‌ టికెట్‌ సరిచేసుకోగా మరికొందరు అవగాహన లేక చేసుకోలేక పోయారు. వాస్తవంగా ప్రైవేటు ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో అనేక తప్పులు దొర్లాయి. హాల్‌ టికెట్లలో అభ్యర్థి పేరు, తండ్రి, తల్లి పేరు, పుట్టిన తేదీ, కులం, లింగం, డిసెబిలిటీ (పీహెచ్‌సీ) వంటి వివరాలతో పాటు ఫొటో లు సరిగా కనిపించకపోవడం, ఫొటో కింద సంతకాలు లేకపోవడం ఇబ్బందిగా తయారైంది. 

పరీక్ష కేంద్రంలో నామినల్‌ రోల్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.  హాల్‌ టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేకపోయినా, అస్సలు లేకపోయినా అభ్యర్థులు తాజా ఫొటోను అతికించి, గెజిటెడ్‌ ఆఫీసర్‌తో అటెస్టేష¯న్‌ చేయించుకొని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో చాలా మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మరికొందరు అవగాహన లేక తిప్పలు పడుతున్నారు.

 గుర్తుంచోవాల్సిన అంశాలు

►పేపర్‌1(ఎస్‌జీటీ) ఉదయం 9.30 గంటల నుంచి 12 వరకు, పేపర్‌2(ఎస్‌ఏ) మధ్యాహ్నం2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది.

►అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా హాలులోకి అనుమతించారు.

►ఓఎమ్‌ఆర్‌ షీట్లను చించడం, మతడపెట్టడం చేయరాదు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు కాబట్టి తెలిసినవి ఆన్సర్‌ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా తెలియని, ఊహించి చెప్పగలిగేవి ఆన్సర్‌ చేయండి.

►ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.

పరీక్ష కేంద్రాల్లో హెల్ప్‌లైన్‌  
టెట్‌ అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. టెట్‌ పరీక్షకు సంబంధించి ఎగ్జామ్‌ సెంటర్లు, రూట్‌మ్యాప్, రవాణా సౌకర్యాలు, ఇతర 
సందేహాలు, సలహాల కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు. 

►హైదరాబాద్‌ : 98488 39244 
►రంగారెడ్డి జిల్లా : 96661 62092, 93968 56548, 77999 99242, 99666 53653 
►మేడ్చల్‌ జిల్లా : 91604 19991  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top