
సాక్షి, వికారాబాద్ జిల్లా: పరిగి మండలం రంగాపూర్ సమీపంలోని బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనవెళ్లి గ్రామానికి చెందిన పలువురు టూరిస్టు బస్సులో పరిగిలో జరిగిన విందుకు హాజరయ్యారు. తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.