జిల్లా కేడర్‌గా టీచర్‌ పోస్టులు  | Sakshi
Sakshi News home page

జిల్లా కేడర్‌గా టీచర్‌ పోస్టులు 

Published Sat, Aug 28 2021 3:03 AM

Telangana: Teachers Posts In Public Schools As Local Cadre - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ పోస్టులను లోకల్‌ కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది. అయితే, వీరందరికి కలిపికాకుండా వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం జీవోలు 254, 255, 256లను జారీ చేశారు. హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్‌ యాజమాన్యంలోని ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, వాటి తత్సమాన పోస్టులను జిల్లా కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది. వాటి ఆధారంగానే భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని పేర్కొంది.

టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ఇవే ఆధారం కానున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్‌ గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 పోస్టులను మల్టీ జోనల్‌ కేడర్‌గా చేసింది. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లోని గెజిటెడ్‌ హెడ్‌ మాస్టర్‌ గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 పోస్టుల లోకల్‌ కేడర్‌ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. హైస్కూల్‌ హెడ్‌మాస్టర్‌ పోస్టులు గతంలో జోనల్‌ కేడర్‌లో ఉండగా, ఇపుడు మల్టీ జోన్‌ పరిధిలోకి తెచ్చింది. 

ఆ పోస్టు బదలాయింపు 
రాష్ట్ర విద్యా శిక్షణా, పరిశోధన సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ), కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (సీటీఈ), ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (ఐఏఎస్‌ఈ)లలో లెక్చరర్‌ పోస్టులను మల్టీ జోనల్‌ కేడర్‌కు ప్రభుత్వం బదలాయించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
Advertisement