కావాల్సినవి 3.50 కోట్లు ముద్రించింది 20 లక్షలు 

Telangana Needed 3. 50 Crore Textbooks Printed 20 Lakhs Textbooks - Sakshi

స్కూళ్లు తెరిచే వేళవుతున్నా పాఠ్యపుస్తకాల కోసం ఇంకా కుస్తీనే

పేపర్‌ ఎప్పుడొస్తుందో, ముద్రణ ఎప్పుడో చెప్పలేని దుస్థితి అరకొరగా జిల్లాలకు పంపిణీ 

ఎవరికి పంచాలో తెలియని అయోమయం 

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు బడిబాట మొదలైంది.. స్కూళ్లు తెరిచే సమయం సమీపిస్తోంది. మరోవైపు పాఠ్యపుస్తకాల కోసం కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 3.50 కోట్ల పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకూ ముద్రించింది కేవలం 20 లక్షలే. ఈ అరకొర పుస్తకాలను పంచాలో, భద్రంగా దాచిపెట్టాలో ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వడంలేదని, ఇవి తరగతిలో కనీసం పదిమందికి కూడా అందే అవకాశం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు.

ఇలా చేస్తే స్థానికంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలకు వచ్చిన పుస్తకాలను ముం దుగా సొంత డబ్బులతో స్కూళ్లకు తీసుకెళ్లాల్సి వస్తోందని టీచర్లు చెబుతున్నారు. దీంతో ఆ పుస్తకాలను జిల్లా కేంద్రాల నుంచి పాఠశాలలకు చేరవేసేందుకు హెచ్‌ఎంలు ముందుకురావడం లేదు. 

పేపర్‌ వచ్చేదెప్పుడు? 
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 24 లక్షల మందికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ప్రైవేటు స్కూళ్లల్లో చదువుతున్న మరో 30 లక్షల మంది విద్యార్థులకు నిర్ణయించిన ధరకు పుస్తకాలు అందించాలి. అన్ని ప్రభుత్వస్కూళ్లల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రవేశపెడుతున్నారు. దీంతో పుస్తకంలో ఒకవైపు ఇంగ్లిష్‌లో, మరోవైపు తెలుగులో పాఠాన్ని ముద్రించాల్సి ఉంది.

ఇలా పుస్తకం బరువు పెరుగుతుండటంతో దాన్ని రెండు భాగాలుగా విడగొట్టి సమ్మెటివ్‌ అసెస్‌మెంట్స్‌ ఒకటి, రెండుగా ముద్రిస్తున్నారు. ఉచితంగా పంపిణీ చేసే పుస్తకాలు 2.10 కోట్లు, ప్రైవేటు స్కూళ్లకు అమ్మే పుస్తకాలు 1.40 కోట్లు ముద్రించాలి. అంటే గతంలో కంటే పేపర్‌ను అధికంగా వాడాలి. వర్షాకాలం మొదలైతే పేపర్‌ రవాణా కూడా కష్టమవుతుందని అధికారులు అంటున్నారు. తమిళనాడు, చండీగఢ్‌ ప్రాంతాల నుంచి పేపర్‌ రావాల్సి ఉంది. పేపర్‌ ఎప్పుడు వస్తుందనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నామని పేర్కొంటున్నారు. 

నిధుల కొరతే కారణమా? 
పాఠ్యపుస్తకాలకు పేపర్‌ అందించే మిల్లు యజమానులు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ధరపై పెద్దగా ఆసక్తి చూపడంలేదని తెలిసింది. దీంతో నాణ్యతలేని పేపర్‌ను తెలంగాణ ముద్రణాలయానికి పంపుతున్నారని తెలుస్తోంది. పుస్తకాల ఖర్చు గతంలో రూ.60 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.120 కోట్లు అవుతుందని అంచనా వేశారు.

కోవిడ్‌ మూలంగా మిల్లుకు సరిపడా గుజ్జు రావడం తగ్గిందని, దీంతో రెండేళ్లుగా వ్యాపారం పడిపోయి, నిర్వహణ ఖర్చులు పెరిగాయనేది మిల్లర్ల వాదన. అయితే, వారు కోరిన మొత్తం ఇవ్వడానికి విద్యాశాఖకు నిధుల సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. 

పేపర్‌ వల్లే ఆలస్యం.. 
ప్రింటింగ్‌కు వాడే పేపర్‌ రాష్ట్రానికి రావడం ఆల స్యం అవుతోంది. అందుకే ముద్రణ ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పటివరకూ 20 లక్షల మేర ముద్రించి జిల్లాలకు పంపాం. వీలైనంత వరకూ ఈ నెలాఖరుకు అన్ని పుస్తకాలు ముద్రించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ముద్రణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పంపిణీ ప్రారంభించడం మంచిది.  
 – ఎస్‌.శ్రీనివాసాచారి, డైరెక్టర్‌ ప్రభుత్వ పుస్తకాలు, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ 

ప్లానింగ్‌ లేకపోవడం వల్లే.. 
ఇంగ్లిష్‌ మీడియం విద్య అందించాలని తెలిసిన ప్పుడు పుస్తకాల ముద్రణ ముందే చేపట్టాలని అధికారులకు తెలియాలి. సరైన ప్రణాళిక లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదు రవు తాయి. స్కూళ్లు తెరిచినా, పుస్తకాలు లేకు ంటే ప్రయోజనం ఏమిటి? అసలెప్పుడొస్తా యో స్పష్టంగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలి.  
– బి.రాజాభానుచంద్ర ప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top