సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది (2027) గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులకు రూ.1000 కోట్లు కేటాయింపునకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. అల్పాహారం, పాలు కూడా అందించాలని నిర్ణయించింది.
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, ఆరు నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన 3 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం చెప్పింది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్కు 18 పోస్టుల మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్ లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.


