
కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్ సముదాయంలో లేడీ కిలాడీల బెదిరింపులు
భయంతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: ఒరేయ్ తలుపులు తీయరా.. నీ అంతు చూస్తాం.. ఉదయంలోగా చచ్చిపో.. లేకుంటే మా చేతిలో చస్తావు అంటూ ముగ్గురు కిలాడీ లేడీలు మారణాయాధాలతో ఓ వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి అర్ధరాత్రి మూడుసార్లు హల్చల్ చేశారు. దీంతో సదరు వ్యక్తి భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధి కైసర్నగర్ డబుల్ బెడ్ రూమ్ సముదాయంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కైసర్ నగర్ డబల్ బెడ్ రూమ్ సముదాయంలో 6వ బ్లాక్ ప్లాట్ నెంబర్ 302 లో బియ్యం పల్లి రాజు (55), జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రాజు బాలానగర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా 2వ బ్లాక్లో నివాసం ఉంటున్న నౌసీమ్ అనే మహిళ అతడిని అనుసరిస్తూ వచ్చింది.
అతడి జేబులో నుంచి డబ్బులు తీసేందుకు ప్రయతి్నంచగా నివారించేందుకు రాజు సదరు మహిళా చేయి పట్టుకున్నాడు. దీంతో సదరు మహిళతో పాటు ఆమె తల్లి షహజాన్, 4వ బ్లాక్లో ఉండే అంజుమా అక్కడికి చేరుకుని రాజును దుర్భాషలాడారు. దీంతో సొసైటీ సభ్యులు జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఆ తర్వాత మళ్లీ రాజు ఇంటికి వచ్చి గొడవ చేయగా స్థానికుడు సతీష్ చెప్పడంతో వెనుదిరిగారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి మారణాయుధాలతో అతడి ఇంటికి వచ్చి ఒరేయ్ బయటికి రారా.. నీవు చచ్చిపోతావా.. మమ్మల్ని చంపమంటావా, ఉదయంలోగా చచ్చిపోవాలి లేకుంటే నీ అంతు చూస్తాం అంటూ హెచ్చరించి వెళ్లిపోయారు. దీంతో ఆందోళనకు గురైన రాజు ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా మరో బెడ్ రూమ్లోకి వెళ్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బుధవారం ఉదయం దీనిని గుర్తించిన అతడి భార్య జ్యోతి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. దీంతో ఆగ్రహానికి లోనైన స్థానికులు రాజు మృతికి కారణమైన వారి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారం అందడంతో సూరారం సీఐ సు«దీర్ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాజు కారణమైన మహిళలపై పోలీసులు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరైన అంజుమా ఈ గొడవకు ముందు మరో వ్యక్తితో గొడవ పెట్టుకొని రభస చేసింది. వీరు ముగ్గురూ నిత్యం అమాయకులను టార్గెట్ చేసుకొని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.