సాక్షి, నల్లగొండ: మిర్యాలగూడలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ అతివేగంతో దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ వరుసగా ఓ ఆంబులెన్స్తో పాటు ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటనతో రోడ్డుపై కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు, క్షతగాత్రుల సంఖ్య, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందా.. లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.


