చెప్పుతో కొట్టిన సర్పంచ్‌.. యువకుడి ఆత్మహత్య

Sarpanch Beat Young Man With Slipper in Jangaon - Sakshi

సాక్షి, రఘునాథపల్లి: వీధి లైటు వేయాలని ప్రశ్నించిన యువకుడిని సర్పంచ్‌ చెప్పుతో కొట్టాడు. దీంతో అవమాన భారం భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సర్పంచ్‌ ధరావత్‌ రమేష్‌ ఆదివారం తండాలో వీధి లైట్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి ముందు కూడా వీధిలైటు వేయాలని తండాకు చెందిన గుగులోతు ఎల్లేష్‌ (28) సర్పంచ్‌ను అడిగాడు. నన్ను అడిగేందుకు నువ్వేవరివి అని సర్పంచ్‌ పేర్కొనడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది.

కోపోద్రిక్తుడైన సర్పంచ్‌.. ఎల్లేష్‌ను చెప్పుతో కొట్టాడు. ఇంటికి వెళ్లిన ఎల్లేష్‌.. జరిగిన విషయాన్ని భార్యతో రోదిస్తూ తెలిపాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. కాగా, తండావాసులు సోమవారం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. సర్పంచ్‌పై కేసు నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తండావాసులు డిమాండ్‌ చేశారు. చివరకు మృతుడి కుటుంబానికి 10 గుంటల భూమి, రూ.30 వేల నగదు ఇచ్చేలా తండా పెద్దలు నచ్చచెప్పారు. (కరోనాతో మరో టీఆర్‌ఎస్‌ నేత‌ మృతి)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top