బాలుడికి ఊపిరి పోసిన ‘సాక్షి’ కథనం  | Sakshi News Effect Heart Disease Child Recovered With Operation In Hyderabad | Sakshi
Sakshi News home page

బాలుడికి ఊపిరి పోసిన ‘సాక్షి’ కథనం 

Apr 13 2021 8:11 AM | Updated on Apr 13 2021 10:24 AM

Sakshi News Effect Heart Disease Child Recovered With Operation In Hyderabad

ఆపరేషన్‌ అనంతరం ప్రియాంక మాఖీయా, కృతజ్ఞతలు తెలుపుతున్న బాలుడి తల్లిదండ్రులు

వారికి తోడు గా వైద్యులు సైతం నిలిచారు. లాక్‌డౌన్, వైద్య పరీక్షలు మూలంగా దాదాపుగా ఏడాది తరువాత బాబుకు ఆదివారం ఆపరేషన్‌ నిర్వహించారు.

రహమత్‌నగర్‌: లాక్‌డౌన్‌ సమయం.. నా అనే వారు లేని బీద కుటుంబం.. ఓ వైపు ఉపాధిలేక మరోవైపు తమ కుమారుడికి ఆపరేషన్‌ చేయించలేక ఆ తల్లిదండ్రులు అల్లాడి పోయారు. ఆ సమయంలో వీరి దీన గాధపై గత ఏడాది మే 26వ తేదీన ‘మా బాబుకు ప్రాణం పోయండి’ అనే శీర్షిçకతో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో మానవతాదృక్పథంతో దాతలు  ముందుకువచ్చి తమవంతుగా ఆర్థిక సహాయం అందించారు. వారికి తోడు గా వైద్యులు సైతం నిలిచారు. లాక్‌డౌన్, వైద్య పరీక్షలు మూలంగా దాదాపుగా ఏడాది తరువాత బాబుకు ఆదివారం ఆపరేషన్‌ నిర్వహించారు. తమ కుమారుడికి ప్రాణం పోసిన, సాక్షి దినపత్రికకు, డాక్టర్లకు, ఆర్థిక సాయం అందించిన దాతలకు తల్లిదండ్రులు చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

గత ఏడాది సాక్షిలో ప్రచురితమైన కథనం 

బీహర్‌ నుంచి భాగ్యనగర్‌కు.. 
బీహర్‌కు చెందిన రమేశ్‌ మాఖీయా, ఆశాదేవిల కూమారుడు ప్రియాంక మాఖీయా(6) పుట్టకతోనే గుండెకు చిల్లు పడింది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ సమయంలో ఎస్పీఆర్‌హిల్స్‌లో చేరుకున్న మాఖీయా దంపతుల దీన స్థితిని వివరిస్తూ ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన స్థానిక బీజేఆర్‌ బస్తీ నేత సంజీవ్‌రావు బాధితులకు నివాసం, భోజనం ఏర్పాటు చేశాడు. వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కథనానికి స్థానికులు, నగరవాసులు మాఖీయా కుటుంబానికి దాదాపు రూ.3లక్షల వరకు ఆర్థిక సాయం అందించారు. బాబు పరిస్థితి చూసిన వైద్యులు డాక్టర్‌ నాగేశ్వర్, డాక్టర్‌ చిన్నాస్వామిరెడ్డి(బెంగుళూరు) తమకు తెలిసిన వైద్యులతో ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు భరిస్తామని ముందుకు వచ్చారు. వివిధ రకాల వైద్య పరీక్షల అనంతరం ఆదివారం బంజారహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో ఆపరేషన్‌ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement