కార్మీకుల వేతనాల్లో సరికొత్త అధ్యాయం | Revolutionary Changes in the Implementation of Minimum Wages in Labour Sector: Telangana | Sakshi
Sakshi News home page

కార్మీకుల వేతనాల్లో సరికొత్త అధ్యాయం

Jun 1 2026 1:13 AM | Updated on Jun 1 2026 1:13 AM

Revolutionary Changes in the Implementation of Minimum Wages in Labour Sector: Telangana

రాష్ట్రంలో కార్మీక రంగంలో చారిత్రక సంస్కరణలు 

కనీస వేతనాల అమలులో విప్లవాత్మక మార్పులు 

జీఓ 6తో కార్మికులకు భరోసా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కార్మీక రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కనీస వేతనాల అమలుకు సంబంధించి జీఓ ఎంఎస్‌ 6ను రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని కనీస వేతనాల విధానాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వేజ్‌ కోడ్‌–2019కు అనుగుణంగా రూపొందించిన ఈ ఉత్తర్వులు రాష్ట్ర కార్మీక రంగంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలవనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా అమలులో ఉన్న కనీస వేతనాల చట్టం–1948 కింద ఉన్న పాత విధానానికి బదులుగా సరళమైన, పారదర్శకమైన, ఏకీకృత వేతన వ్యవస్థను అమలు చేయడం ద్వారా కార్మీకుల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించే ప్రయత్నం చేసినట్టు కార్మీక శాఖ అధికారులు చెబుతున్నారు.

కొత్తగా తీసుకొచ్చిన వేతన సవరణ ప్రకారం కార్మీకులకు వేతనాల్లో మార్పు జూన్‌1వ తేదీ నుంచి అమల్లోవస్తుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు వివిధ రంగాలు, పరిశ్రమలు, ఉపాధి వర్గాలకు వేర్వేరు కనీస వేతనాలు అమలులో ఉండేవి. దీనివల్ల యజమానులు, కార్మీక శాఖ అధికారులు, కార్మీకులు అనేక రకాల ఇబ్బందులు తలెత్తేవి. తాజాగా జారీ చేసిన నూతన ఉత్తర్వుల ప్రకారం వందల సంఖ్యలో ఉన్న పరిశ్రమల వారీ షెడ్యూళ్లను రద్దు చేసి, నైపుణ్య స్థాయి మరియు భౌగోళిక ప్రాంతాల ఆధారంగా ఏకీకృత వేతన వ్యవస్థను ప్రవేశపెట్టినట్‌లైంది. 

నగదు చెల్లింపులకు చెక్‌ 
కార్మీకుల వేతనాల చెల్లింపులో పారదర్శకత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై కార్మికులకు నెలవారీ వేతనాలను బ్యాంకు ఖాతాల ద్వారా ఎల్రక్టానిక్‌ బదిలీ లేదా చెక్కు రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కొత్త విధానంలో నెలవారీ వేతనాల లెక్కింపును 26 రోజుల పనిదినాల ఆధారంగా నిర్ణయించారు. అంటే వారాంతపు సెలవుల కారణంగా కార్మీకులకు వేతన నష్టం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించింది. ఆదివారం లేదా వారాంతపు సెలవులు తీసుకున్నా వేతనంపై ప్రభావం ఉండదు. రోజుకు ఎనిమిది గంటల పని సమయాన్ని మించి పని చేయించినా, ప్రభుత్వ సెలవు దినాలు లేదా వారాంతపు సెలవు దినాల్లో పని చేయించినా సాధారణ వేతనానికి రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అదనపు శ్రమకు తగిన ప్రతిఫలం లభించేలా చట్టబద్ధమైన హామీ లభించింది. 

 

ట్రైనీలు, అప్రెంటిస్‌లకు కనీస భరోసా 
శిక్షణ పేరుతో తక్కువ వేతనాలు చెల్లించే పరిస్థితులకు చెక్‌ పెట్టేందుకు ట్రైనీలు, అప్రెంటిస్‌లకు ఆయా కేటగిరీ కనీస వేతనంలో కనీసం 75 శాతం చెల్లించాల్సిన నిబంధనను తీసుకొచ్చారు. దీంతో శిక్షణార్థుల ఆర్థిక భద్రతకు కొంత మేర భరోసా లభించనుంది. 

పరిశ్రమలకు కూడా లాభాలే... 
కార్మిక సంక్షేమంతోపాటు పరిశ్రమల నిర్వహణను సులభతరం చేయడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటి వరకు వేర్వేరు పరిశ్రమలకు వేర్వేరు వేతన షెడ్యూళ్లు ఉండటంతో ఏర్పడే చట్టపరమైన సంక్లిష్టతలను తొలగించింది. ఒకే విధమైన వేతన గ్రిడ్‌ ఉండటంతో యాజమాన్యాలపై అనుసరణ భారం తగ్గుతుందని పరిశ్రమల వర్గాలు భావిస్తున్నాయి.

మూడు జోన్లు  
రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ప్రభుత్వం విభజించింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతాలు జోన్‌–1గా, మున్సిపాలిటీలు జోన్‌–2గా, గ్రామీణ మరియు ఇతర ప్రాంతాలను జోన్‌–3గా గుర్తించారు. ఉద్యోగులను నైపుణ్యం లేనివారు, పాక్షిక నైపుణ్యం కలిగినవారు, నైపుణ్యం కలిగినవారు, అత్యున్నత నైపుణ్యం కలిగినవారిగా నాలుగు వర్గాలుగా విభజించారు. 

Advertisement
 
Advertisement
Advertisement