
పెద్ద ధన్వాడలో ఫ్యాక్టరీ వాహనాలపై స్థానికుల దాడి
పరిశ్రమలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు
గతంలో దిలావర్పూర్.. తాజాగా పెద్ద ధన్వాడలో ఆందోళన
ఈ పరిశ్రమలతో కాలుష్యం పెరిగిపోతుందని ఆగ్రహం
ధాన్యం ఆధారిత ఇథనాల్ తయారీపైనే అభ్యంతరాలు
రాష్ట్రంలో ఇథనాల్ తయారీ కోసం 31 సంస్థలు దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల ఏర్పాటుపై ప్రజల నిరసన జ్వాలలు చల్లారడం లేదు. గతంలో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజలు తిరగబడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేసింది. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలోనూ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు స్థానికులు దాడులకు దిగారు.
ఇథనాల్ ఫ్యాక్టరీల ద్వారా వాయు, జల కాలుష్యం ఏర్పడి తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నారాయణపేట జిల్లా చిత్తనూరులోనూ ఇథనాల్ యూనిట్ ఏర్పాటుపై నిరసనలు వ్యక్తమైనా, నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. నారాయణపేట జిల్లా హిందూపూర్, జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ప్రైవేటు సంస్థలు.. ప్రజల నిరసనల నేపథ్యంలో పనులు చేపట్టేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ లక్ష్యం 43 కోట్ల లీటర్లు
విదేశాల నుంచి శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018లో ‘నేషనల్ బయో ఫ్యూయల్ పాలసీ’ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్’కింద 2025–26 నాటికి మొలాసిస్ లేదా ధాన్యం నుంచి 1,080 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది. తెలంగాణకు 43 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యాన్ని ఇచ్చింది.
ఈ లెక్కన తెలంగాణలో రోజుకు 5,256 కిలో లీటర్ల (కేఎల్పీడీ) ఇథనాల్ ఉత్పత్తి కావాలి. ఇథనాల్ తయారీ యూనిట్లు ఏర్పాటుచేసే సంస్థలకు ‘ఇథనాల్ ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్’కింద కేంద్రం వడ్డీలో రాయితీ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో 31 సంస్థలు ఇథనాల్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాగా, 2018–2022 మధ్య 28 సంస్థలకు అనుమతులు వచ్చాయి.
అయితే, అనుమతి పొందిన సంస్థల్లో ఎన్ని నిర్మాణ పనులు ప్రారంభించాయనే సమాచారం తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఉమ్మడి జాబితాలో ఉన్న ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టం (ఐడీఆర్ యాక్ట్) ప్రకారం ఇథనాల్ తయారీ కేంద్ర జాబితాలో చేరింది. దీనిని గతంలో 16 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆమోదించినా తెలంగాణ, ఆంధప్రదేశ్ దూరంగా ఉన్నాయి.
అయితే, ఇథనాల్ తయారీని ఉమ్మడి జాబితాలో చేర్చి రాష్ట్రాలకు పర్యవేక్షక బాధ్యత అప్పగించాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. అయినా రాష్ట్రంలో ఇథనాల్ తయారీ యూనిట్ల అనుమతులకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది. లైసెన్స్, రవాణా, మార్కెటింగ్, భూ కేటాయింపులు వంటి అంశాలతో తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ధాన్యం ఆధారిత ఇథనాల్పైనే వ్యతిరేకత
రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమలు చెరకును గానుగ అడించడం ద్వారా వచ్చే మొలాసిస్తో ఇథనాల్ తయారు చేస్తున్నాయి. గాయత్రి (45 కేఎల్పీడీ), గణపతి (30 కేఎల్పీడీ), మధుకాన్ (60 కేఎల్పీడీ), కృష్ణవేణి (120 కేఎల్పీడీ) ఇథనాల్ను తయారు చేస్తున్నాయి. చెరకు ఫ్యాక్టరీకి రాని సీజన్లో ధాన్యం ఆధారిత మొలాసిస్ ద్వారా కూడా ఈ ఫ్యాక్టరీల్లో ఇథనాల్ తయారు అవుతోంది.
ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ కింద ఏర్పాటయ్యే యూనిట్లు వరి, మొక్కజొన్న, జొన్న తదితర ధాన్యాల నుంచి మొలాసిస్ను తయారు చేసే ప్రక్రియలో నీటి వినియోగం, దుర్వాసన, కాలుష్య వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రకమైన పరిశ్రమలపైనే స్థానికుల్లో వ్యతిరేకత వస్తోంది. ప్రజలకు సరైన అవగాహన లేనందునే వ్యతిరేకత వస్తోందని పారిశ్రామికవర్గాలు చెప్తున్నాయి.
అనుమతులు రద్దు చేయాలి
పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల వెనుక అధికార పార్టీ అండదండలున్నాయి. రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలి. రైతులపై పోలీసు కేసులు, అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
– డాక్టర్ ఆంజనేయగౌడ్, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్
12 గ్రామాలకు ఇబ్బంది
పచ్చని పంట పొలాల నడుమ కాలుష్య చిచ్చును పెట్లే ఫ్యాక్టరీ వద్దంటున్నా పనులు చేపడుతున్నారు. గతంలో అధికారులకు ఎన్నోమార్లు వినతులు ఇవ్వడంతో పాటు నెలల తరబడి ఆందోళన చేస్తున్నాం. 12 గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఫ్యాక్టరీ నిర్మించాలనే ప్రతిపాదన విరమించుకోవాలి.
– విజయ్కుమార్, రాజోళి, గద్వాల జిల్లా