సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారంలో విధి నిర్వహణలో ఉన్న ఓ జవాన్పై పాక్ ప్రేరేపిత ఐఎస్ఐ ఖైదీ దాడికి పాల్పడిన ఉదంతమిది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం ఐదు గంటలకు చోటుచేసుకుంది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చర్లపల్లిలో విధులు నిర్వహిస్తున్న రాజేష్ అనే జవాన్ చేతిలో లాఠీ పట్టుకుని రౌండ్స్లో ఉన్నారు. జైలులోని యూనిట్ ఆసుపత్రి వద్ద ఆయన తనిఖీల్లో ఉండగా, అప్పడే చికిత్స కోసం మాజ్ అనే ఖైదీ చికిత్స కోసం వచ్చాడు.
ఆసుపత్రిలో మహిళా డాక్టర్తో తనను నిమ్స్ కానీ, ఉస్మానియా ఆసుపత్రి కానీ రిఫర్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. చిన్న ఆరోగ్య సమస్యేనని.. అవసరమైతే రేపు మరోసారి పరీక్షించి రిఫర్ చేస్తామని డాక్టర్ చెప్పారు. దాంతో శివాలెత్తిపోయిన మాజ్.. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి తిట్లు పురాణం ప్రారంభించారు. అదే సమయంలో రౌండ్స్లో ఉన్న రాజేష్ను తీవ్రంగా దూషించారు. అంతటితో ఆగకుండా రాజేష్ చేతులోని లాఠీని లాక్కుని ఆయనపై దాడి చేశారు.
తోటి సిబ్బంది ఇతర ఖైదీలు వెంటనే స్పందించి మాజ్ను నిలువరించారు. అక్కడే విధుల్లో ఉన్న ఓ డిప్యూటీ జైలర్.. మరో జవాన్ ఆ ఖైదీపై ఎదురుదాడి చేసి రాజేష్ను కాపాడారు. ఐఎస్ఐ సంబంధింత కేసులో మాజ్ చర్లపల్లి జైలుకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్లపల్లి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శివకుమార్గౌడ్ వివరణ తీసుకునేందుకు ‘సాక్షి’ యత్నించగా ఆయన ఫోన్లో స్పందించలేదు. ఈ ఘటనపై మరిని వివరాలు తెలియాల్సి ఉంది.


