సాక్షి, హైదరాబాద్: ముషీరాబాద్లో కల్తీ, గడువు ముగిసిన ఐస్ క్రీమ్ల తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ బృందాలు) హెచ్-ఫాస్ట్ (H-Fast) టీమ్, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ నగర్లో ఉన్న 'బ్లూ బెల్స్ ఐస్ క్రీం' (Blue Bells Ice Cream) తయారీ కేంద్రంపై మెరుపు దాడులు చేశారు.
ఈ దాడుల్లో ఎటువంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో, గడువు ముగిసిన ముడి పదార్థాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్న పట్టాల అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున కల్తీ ఐస్ క్రీం ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. నాణ్యమైన ఐస్ క్రీమ్లంటూ నమ్మబలుకుతూ హోల్ సేల్, రిటైల్ కస్టమర్లకు సరఫరా చేస్తూ అక్రమ లాభాలు గడిస్తున్నాడు. తయారీలో గడువు ముగిసిన (Expired) రంగులు, ఫ్లేవర్లను ఉపయోగిస్తూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించారు. అలాగే తయారీ కేంద్రం, ముడి పదార్థాల నిల్వ ప్రాంతం అత్యంత అపరిశుభ్రంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఈ దాడుల్లో పోలీసులు మొత్తం రూ. 1,75,000 విలువైన 3,759 వివిధ రకాల ఐస్ క్రీం ఉత్పత్తులను (సుమారు 1,252 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 4 లీటర్ల ప్యాకింగ్లో ఉన్న 400 లీటర్ల వెనీలా, 320 లీటర్ల బటర్ స్కాచ్, 120 లీటర్ల అమెరికన్ నట్స్, 120 లీటర్ల స్ట్రాబెర్రీ, 80 లీటర్ల డ్రై ఫ్రూట్, 60 లీటర్ల మాంగో, 20 లీటర్ల క్రీమ్ & కుకీస్ ఐస్ క్రీంలు ఉన్నాయి. అలాగే విక్రయానికి సిద్ధంగా ఉన్న 2,550 పెప్సీ ఐస్ క్రీం ప్యాకెట్లు, 1 లీటర్ ప్యాకింగ్లో ఉన్న 38 లీటర్ల స్పెషల్ ఫ్లేవర్, 24 లీటర్ల స్ట్రాబెర్రీ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అర లీటర్ ప్యాకింగ్లో ఉన్న 20 లీటర్ల స్పెషల్ ఫ్లేవర్, 10 లీటర్ల స్ట్రాబెర్రీ ఐస్ క్రీంలు, 50 ml పరిమాణంలో ఉన్న 800 మలై కుల్ఫీ ఐస్ క్రీంలను (40 లీటర్లు) సీజ్ చేశారు.
ముఖ్యంగా తయారీలో వాడుతున్న కృత్రిమ ఆహార రంగులు (180 గ్రాముల ప్యాకెట్లు), టోన్కిన్ సింథటిక్ ఫుడ్ కలర్తో పాటు, గడువు ముగిసిన పైనాపిల్, మాంగో, సీతాఫల్ ఫ్లేవర్ బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


