సాక్షి, హైదరాబాద్: కుళ్లిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలను తయారీ చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైలార్దేవ్పల్లి పోలీసులు కాటెదాన్లోని ఆహార తయారీ కేంద్రంపై మెరుపు దాడి నిర్వహించారు. ఇంద్ర సొసైటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు వాడుతూ పిల్లలు తినే డోనట్ బన్స్, కేకులు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
నిందితులు అఫ్రిది అన్సారీ, యాసిన్, ఖత్రేషన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ‘మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ’ పేరుతో ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. బయట మార్కెట్ నుండి కుళ్లిపోయిన, పగిలిపోయిన కోడిగుడ్లను సేకరించి, వాటికి సోడియం బెంజోయేట్, సోర్బిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి, అపరిశుభ్ర వాతావరణంలో డోనట్స్, కేకులు తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలు తినడం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
కుళ్లిపోయిన కోడిగుడ్లు(330) రసాయనాలు సోడియం బెంజోయేట్ (15 కిలోలు), సోర్బిక్ యాసిడ్ (15 కిలోలు), పొటాషియం సోర్బేట్ (20 కిలోలు), పీజీపీఆర్ లిక్విడ్, అమ్మోనియా సల్ఫైట్, తయారైన డోనట్స్, కేకులు (150 కిలోలు), డాల్డా (120 కిలోలు), మిల్క్ పౌడర్ (25 కిలోలు), మిక్సింగ్ మెషీన్లు, స్పైరల్ మెషీన్, ఓవెన్లు, వెయింగ్ మెషీన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


