Sakshi News home page

ఇద్దరు వ్యక్తుల ప్రైవేటు సంభాషణ మూడో వ్యక్తి ఎలా వింటున్నాడు..!

Published Sun, Mar 31 2024 4:51 AM

Phone Tapping: technology to record someone speech - Sakshi

సులభంగా మారిపోయిన ఫోన్‌ ట్యాపింగ్‌

ఎక్కడ కావాలంటే అక్కడ.. ఎవరి మాటలైనా రికార్డు చేసే టెక్నాలజీ

ఫోన్‌ ట్యాపింగ్‌.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాపింగ్‌ మాటున కొందరు అధికారులు సాగించిన దందా.. రోజురోజుకూ వెలుగుచూస్తున్న సంచలన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు.. ఫిర్యాదుల వంటి విషయాలను పక్కనపెడితే.. అసలు ట్యాపింగ్‌ కథేంటి? దీనిని ఎలా చేస్తారు? ఇద్దరు వ్యక్తులు ప్రైవేటుగా మాట్లాడుకునే మాటలన్నీ మూడో వ్యక్తి ఎలా వినగలుగుతున్నాడు? ఓసారి చూద్దామా?

► ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు టెలిఫోన్‌ లేదా మొబైల్‌ ఫోన్‌ లేదా ఇంటర్నెట్‌ ద్వారా జరిపే సంభాషణలను వారికి తెలియ కుండా రహస్యంగా వినడం, రికార్డు చేయడాన్నే ట్యాపింగ్‌ అంటారు. వాస్తవానికి ట్యాపింగ్‌ చేయడం చట్టవిరు ద్ధం. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్యాపింగ్‌ చేయాల్సి వస్తే.. నిర్దేశిత ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి.

ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాపింగ్‌ చేయడానికి అనుమతి లేదు. అనుమతి పొందిన ప్రభుత్వ సంస్థలు సైతం ట్యాపింగ్‌ చేయడానికి బోలెడు నిబంధనలు పాటించాలి. ఎవరి ఫోన్‌ అయినా గరిష్టంగా 180 రోజులు మాత్రమే ట్యాపింగ్‌ చేయాలి. పైగా ప్రతి 60 రోజులకు ఓసారి తాజాగా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి లేకుండా గరిష్టంగా 24గంటలకు మించి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడానికి వీల్లేదు. ఒకవేళ సదరు ట్యాపింగ్‌కు కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరిస్తే అప్పటివరకు రికార్డు చేసిన సంభాషణలన్నీ 48 గంటల్లోగా ధ్వంసం చేయాల్సి ఉంటుంది. 

ట్యాపింగ్‌లో రకాలు..
సెల్యులర్‌ ఇంటర్‌సెప్టర్లు..
► వీటిని ఐఎంఎస్‌ఐ క్యాచర్స్‌ లేదా స్టింగ్‌రేస్‌ అని పిలు స్తారు. టవర్ల ద్వారా ప్రసార మయ్యే నిర్దేశిత మొబైల్‌ సిగ్నల్స్‌ను ఇవి అడ్డుకుంటా యి. అందు లోని డేటాను క్యాప్చర్‌ చేయడమే కాకుండా.. మొబైల్‌ లొకేషన్‌ కూడా ట్రాక్‌ చేస్తాయి. కాల్స్‌తో పాటు ఎస్సెమ్మెస్‌ లను సైతం సంగ్రహిస్తాయి. 

వీఓఐపీ ఇంటర్‌సెప్షన్‌ సాధనాలు.. 
►  వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ (వీఓఐపీ) కమ్యూనికేషన్‌లను సంగ్రహించేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ ఆధారిత సాధనాలివి. వీఓఐపీ ప్రొటోకాల్స్‌లోని బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్‌లో ప్రయాణించే డేటా ప్యాకెట్‌లను ఇవి అడ్డుకుని అందులోని డేటాను సంగ్రహిస్తాయి.

క్లోన్డ్‌ సిమ్‌ కార్డులు..
► ట్యాపింగ్‌ చేయాలనుకున్న వ్యక్తి సిమ్‌కు క్లోన్డ్‌ సిమ్‌ సంపాదిస్తే చాలు.. సదరు వ్యక్తి మొబైల్‌ ఫోన్‌కు వచ్చే కాల్స్‌ అన్నీ చక్కగా వినొచ్చు.

రాజకీయపరమైన నిఘా.. 
► సర్వీస్‌ ప్రొవైడర్‌ సహకారంతో రాజకీయ నాయకుల కాల్స్‌ రికా ర్డు చేస్తారు. ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి ఉండదు. అందువల్ల ఇది అక్రమ ట్యాపింగ్‌.

మానిటరింగ్‌ సాఫ్ట్‌వేర్‌..
హానికరమైన సాఫ్ట్‌వేర్‌ లేదా స్పైవేర్‌ను నిర్దేశిత వ్యక్తి మొబైల్‌ ఫోన్‌లో వారికి తెలియకుండా చొప్పిస్తారు. ఇవి ఆ ఫోన్‌ సంభాషణలను రికార్డు చేసి బయటి వ్యక్తు లకు పంపించడంతోపాటు ఫోన్లో ఉన్న సమస్త సమాచారాన్ని మనకు తెలియకుండా బహిర్గతం చేస్తుంది.

అధికారిక ట్యాపింగ్‌..
 ప్రభుత్వ అనుమతి తీసుకుని సర్వీస్‌ ప్రొవైడర్‌ సహకారంతో చేసే ట్యాపింగ్‌ ఇది. క్లండెస్టైన్‌ రికార్డర్‌ ఉపయోగించి సంభాషణలను రికార్డు చేస్తారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు డిజి టల్‌ ఫోరెన్సిక్స్‌ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సాధనాలను ఉపయోగించి ఈ ట్యాపింగ్‌ చేస్తాయి. 

ల్యాప్‌టాప్‌ సైజు పరికరంతోనే..
► అక్రమంగా ట్యాపింగ్‌ చేసేవాళ్లకు పెద్దగా ఎక్విప్‌మెంట్‌ కూడా అక్కర్లేదు. ఓ ల్యాప్‌ టాప్‌ సైజులో ఉండే సెల్యులర్‌ ఇంటర్‌సెప్షన్‌ మెషీ న్‌ను కారులో పెట్టుకుంటే చాలు.. ఎవరి ఫోన్‌ అయినా సులభంగా ట్యాప్‌ చేసేయొచ్చు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సిన వ్యక్తి ఇల్లు లేదా ఆఫీసు వద్ద కారు పార్క్‌ చేసుకుంటే చాలు అవతలి వ్యక్తి సంభాషణలన్నీ వినొచ్చు.. రికార్డు చేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తి ఫోన్‌ నంబర్‌ను మెషీన్‌లో ఫీడ్‌ చేయాలి. అనంతరం ఆ వ్యక్తికి ఫోన్‌ వస్తే.. ఆటోమేటిగ్గా మెషీన్‌లో రికార్డు అయిపో తుంది. సదరు వ్యక్తి గొంతును రికార్డు చేసి మెషీన్‌లో ఫీడ్‌ చేసినా సరే.. దాని ఆధారంగా ఆ కాల్‌ను మెషీన్‌ రికార్డు చేస్తుంది.

ఇజ్రాయెల్‌ పేరే ఎందుకు?
ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి అంశాలు తెరపైకి వచ్చిన ప్పుడు ఇజ్రాయెల్‌ పేరే వినిపిస్తుంది. అధునాతన సాంకేతిక రంగానికి ఇజ్రాయెల్‌ ప్రసిద్ధి చెందడమే ఇందుకు కారణం. ఫోన్‌ ట్యాపింగ్‌ టెక్నాలజీతో సహా నిఘా, గూఢచార సేకరణ పరికరాలను అభివృద్ధి చేసే నైపుణ్యం ఇజ్రాయెల్‌ సొంతం. ఇటీవల మన దేశంలో సహా పలు దేశాల్లో సంచలనం సృష్టించిన పెగాసస్‌ స్పైవేర్‌ రూపొందించింది ఇజ్రాయెలే కావడం గమనార్హం. 

ట్యాపింగ్‌ చేసే అధికారం ఎవరికి ఉంది?
జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్, నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌తో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు నిబంధనలకు అనుగు ణంగా ఎవరి ఫోన్‌ అయినా ట్యాపింగ్‌ చేయొచ్చు.

సెల్యులర్‌ ఇంటర్‌సెప్టర్‌ ఎలా పనిచేస్తుందంటే?
ఇది చాలా సులభమైన ట్యాపింగ్‌ ప్రక్రియ. కాకపోతే ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. చిన్న సూట్‌ ్డకేసులో ఇమిడిపోయే ఈ పరికరంతో.. నిర్దేశిత వ్యక్తుల ఫోన్లను భౌతికంగా ముట్టు కోకుండా.. ఎలాంటి స్పైవేర్లూ చొప్పించకుండా ట్యాపింగ్‌ చేయొచ్చు. సాధారణంగా మనం ఎవరికైనా కాల్‌ చేసినప్పుడు మన సెల్‌ ఫోన్‌ నుంచి సిగ్నల్స్‌ సమీపంలోని టవర్‌ ద్వారా నిర్దేశిత మార్గంలో అవతలి వ్యక్తికి చేరతాయి. ఈ ప్రక్రియలో సెల్‌ టవర్ల నుంచి ప్రసారమయ్యే సిగ్నల్స్‌ను నేరుగా ఈ మెషీన్లు సంగ్రహించి ఆ సంభాషణలు వినేలా, రికార్డు చేసేలా పనిచేస్తాయి.

ఈ మెషీన్లలో కూడా చాలా రకాలున్నాయి.200 మీటర్ల పరిధి నుంచి దాదాపు 20 కిలోమీ టర్ల పరిధిలోని సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ను ఇవి సంగ్రహించగలవు. కొన్ని మెషీన్లు సెల్‌ఫోన్‌ నుంచి వచ్చే సిగ్నల్స్‌ను టవర్‌కు వెళ్లకుండా ముందుగానే సంగ్రహిస్తాయి. అలాగే సామార్థ్యాన్ని బట్టి పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో కాల్స్‌ వరకు ఒకేసారి ఈ మెషీన్లు రికా ర్డు చేయగలవు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లే కాకుండా సోషల్‌ మీడియాతోపాటు మన సెల్‌ డివైస్‌ లోని సమస్త సమాచారాన్ని యాక్సెస్‌ చేసే ఇంటర్‌సెప్టర్లు ఉన్నాయి. వాస్తవా నికి వీటిని కొనాలన్నా చాలా అనుమ తుల తతంగం ఉంటుంది. అయితే, ఇజ్రాయెల్, సింగ పూర్‌ తదితర దేశాల నుంచి వీటిని అక్రమ పద్ధతిలో సమ కూర్చుకుంటున్నారు.

మీ ఫోన్‌లో వైరస్‌ ఉందా!?
తగిన జాగ్రత్తలతో డేటాను భద్రపరచుకోవచ్చంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్‌: స్మార్ట్‌ఫోన్లు అందు బాటులోకి వచ్చాక మన పనులు ఎంత సులు వయ్యాయో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దానితో బోలెడు ముప్పులు సైతం పొంచి ఉన్నాయని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ముఖ్యంగా సైబర్‌ నేరగాళ్లు ఫోన్లలోకి ఏదో ఒక రూపంలో వైరస్‌ను చొప్పించి ఫొటో లు, వీడియోలు సహా కీలక డేటా కొట్టేయడం, మార్ఫింగ్‌కు వాడుకోవడం లేదా ఆ సమాచారంతో బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఫోన్లో వైరస్‌ చొరబడితే దాని పనితీరు ఎలా ఉంటుందో, హ్యాకింగ్‌కు గురైన ఫోన్‌ను తిరిగి ఎలా బాగుచేసుకోవాలో కీలక సూచనలు చేశారు.

హ్యాకింగ్‌కు గురయ్యే ఫోన్‌ పనితీరు ఇలా
► ఫోన్‌ చార్జింగ్‌ చేసిన కాసేపటికే చార్జింగ్‌ డౌన్‌ కావడం లేదా వేగంగా బ్యాటరీ తగ్గి పోవడం ఫోన్‌ హ్యాకింగ్‌కు అత్యంత ముఖ్య మైన సంకేతం. మన ఫోన్‌లో ఏవైనా అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతుంటే.. మన మొబైల్‌ ఫోన్‌ను తక్కువగా వాడినా, బ్యాటరీ మాత్రం అసాధరణంగా తగ్గిపోతుంది.
► మనకు తెలియని సోర్స్‌ల నుంచి కొత్తకొత్త యాడ్స్‌ వస్తుండటం, ఫ్లాష్‌ యాడ్స్‌ వస్తుండటం సైతం హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపే సూచిక.
► మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌ యాప్స్‌ రన్‌ అవడం, కొన్ని హిడెన్‌ యాప్స్‌ పనిచేస్తుండటంతో మొబైల్‌ ఫోన్‌ బాగా వేడెక్కుతుంది. ఇలా జరిగితే కూడా ఫోన్‌ హ్యాక్‌ అయినట్లు అనుమానించాలి. 

► కొత్త నంబర్ల నుంచి తరచూ ఫోన్‌ కాల్స్‌ వస్తుండటం, టెక్సŠట్‌ మెసేజ్‌లలో వింత సింబల్స్, క్యారెక్టర్ల కాంబినేషన్స్‌తో రావడం గమనిస్తే ఫోన్‌ హ్యాక్‌ అయినట్లు గుర్తించాలి.
► మొబైల్‌ఫోన్‌ హ్యాక్‌ అయితే పనితీరు బాగా నెమ్మదిస్తుంది. ఫోన్‌కాల్‌ చేయడానికి, మెసేజ్‌లు ఓపెన్‌ కావడానికి, ఇతర యాప్‌లు పనిచేయడం నెమ్మదిగా జరుగుతుంది.
► ఫోన్‌లోని కెమెరా, మైక్రోఫోన్‌లు మనకు తెలియకుండానే యాక్టివ్‌ కావడం గమనిస్తే అనుమానించాల్సిందే. 
► ఫోన్‌లోని స్క్రీన్‌లాక్, యాంటీ వైరస్‌ వంటి సెక్యూరిటీ ఫీచర్లన్నీ మనకు తెలియకుండానే డిసేబుల్‌ కావడం ఫోన్‌ హ్యాకింగ్‌ అయ్యిందనడానికి అత్యంత కీలకమైన మార్పుగా గుర్తించాలి.

ఫోన్‌ హ్యాక్‌ అయితే ఏం చేయాలి..?
►  ఏదైనా ఉత్తమమైన యాంటీ వైరస్‌ సాప్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని ఫోన్‌ను స్కాన్‌ చేయాలి.
►  ఫోన్‌లో అనుమానాస్పద యాప్‌లను గమనిస్తే వాటిని వెంటనే డిలీట్‌ చేయాలి.
► ఫోన్‌ హ్యాక్‌ అయి, ఫోన్‌ నుంచి డేటా ట్రాన్స్‌ఫర్‌ అవుతున్నట్లు అనుమానిస్తే వెంటనే ఇంటర్నెట్‌ డేటా ఆఫ్‌ చేయాలి. వైఫై కనెక్షన్‌ తొలగించాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్లకు డేటా ట్రాన్స్‌ఫర్‌ ఆగిపోతుంది.
► ఫోన్‌ స్కీన్ర్‌ లాక్, యాప్‌ లాక్‌లు, ఈ–మెయిల్, సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చేయాలి. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అడ్డుకోవచ్చు.
► పైవన్నీ చేసినా ఫలితం లేనట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్‌ను రీసెట్‌ చేయాలి. దీనివల్ల మాల్‌వేర్‌ అంతా పోవడంతోపాటు అను మాస్పద యాప్‌లు డివైస్‌ నుంచి తొలగి పోతాయి. అయితే మన వ్యక్తిగత సమా చారం, ఫొటోలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు..
► మొబైల్‌ ఫోన్‌లోని ఫొటోలు, వీడియో లు, ఇతర డేటాను, సోషల్‌ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు పెన్‌డ్రైవ్, ఇతర డివైస్‌లలో బ్యాకప్‌ చేస్తూ ఉండాలి. ఫోన్‌ హ్యాక్‌ అయినా వెంటనే దాన్ని రీసెట్‌ చేయొ చ్చు.ముందే బ్యాక్‌అప్‌ ఉంటుంది కాబ ట్టి డేటా పోయే ప్రమాదం ఉండదు. 
► యాపిల్, ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఆరు అంకెల పాస్‌వర్డ్‌లు తప్పక పెట్టుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.

►  కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసే ముందు పూర్తిగా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి.
► పబ్లిక్‌ వైఫైను వీలైనంత వరకు వాడకపోవడం ఉత్తమం. తప్పనిసరైతే వీపీఎన్‌ టూల్స్‌ ద్వారా వాడాలి. ఇలా చేయడం వల్ల మన డేటా ప్రైవేటు ఎన్‌క్రిప్టెడ్‌ చానల్‌ ద్వారా వెళ్తుంది. 

Advertisement
Advertisement