తహసీల్దార్‌ ఆఫీస్‌లో క్షుద్రపూజలు | Occult Worship in Jagtial District | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ ఆఫీస్‌లో క్షుద్రపూజలు

Jul 9 2026 8:02 AM | Updated on Jul 9 2026 9:09 AM

Occult Worship in Jagtial District

జగిత్యాల జిల్లా: మూఢనమ్మకాల బారిన పడకుండా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన ప్రభుత్వ అధికారులే మూఢనమ్మకాలను ప్రోత్సహించిన సంఘటన జగిత్యాల జిల్లా, రాయికల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో చోటు చేసుకుంది. తమ సిబ్బంది తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, కీడు సోకడమే కారణమని మంగళవారం అర్ధరాత్రి దాటాక క్షుద్రపూజలు చేయించారు. కొంతకాలంగా రాయికల్‌ పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయ ఉద్యోగులు, జీపీవోలు వాహన ప్రమాదాలకు గురవుతున్నారు.

 బదిలీపై వచ్చి కార్యాలయంలో అడుగుపెట్టగానే ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు జీపీవోలు ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో రెవెన్యూ అధికారులకు భయం పట్టుకుంది. కార్యాలయం ఎదుట క్షుద్రపూజలు చేయించారు. విషయం బయటకు పొక్కకుండా రెవెన్యూ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు సీసీ కెమెరాలను బంద్‌ చేయించారు. 

కానీ ఒక పిల్లర్‌ దగ్గర గుంత, గొర్రెను బలి ఇచ్చినట్లు ఆనవాళ్లు కనిపించడంతో పట్టణంలో కలకలం రేగింది. బుధవారం ఉదయం మల్లాపూర్‌ మండలం వీవీరావుపేటలోని గంగ వద్ద విందు భోజనాలు కూడా చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ విషయమై తహసీల్దార్‌ నాగార్జునను వివరణ కోరగా.. క్షుద్ర పూజల విషయం తన దృష్టికి రాలేదన్నారు. తహసీల్దార్‌కు తెలియకుండానే కార్యాలయం ఆవరణలో ఇలాంటి వ్యవహారం జరగడం చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement