ఫేస్‌బుక్‌ పరిచయం.. వివాహితకు శాపం | NRI Young Man Blackmail In Marriage Woman | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ పరిచయం.. వివాహితకు శాపం

Feb 9 2025 8:12 AM | Updated on Feb 9 2025 8:12 AM

NRI Young Man Blackmail In Marriage Woman

ఎన్నారై యువకుడి బ్లాక్‌ మెయిల్‌ 

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

బంజారాహిల్స్‌: ఫేస్‌బుక్‌ పరిచయం ఆమె పాలిట శాపమైంది. కువైట్‌లో ఉన్న ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌ చాట్‌లో తీయటి మాటలతో ఓ వివాహితను లోబర్చుకున్నాడు. హైదరాబాద్‌ వచ్చిన ప్రతిసారీ ఆమెతో శారీరకంగా కలవడమే కాకుండా ప్రైవేటు ఫొటోలను, వీడియోలను కూడా తీశాడు. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో ఆ ఫొటోలను పోస్ట్‌ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతుండటంతో బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కువైట్‌లో ఉంటున్న కుడుపూడి ప్రసాదరావుతో నగరానికి చెందిన ఓ వివాహితకు ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. 

ఆ తర్వాత తరచూ చాటింగ్‌ చేసుకోవడంతో ఇద్దరి మధ్య   స్నేహం ఏర్పడింది. తన పట్ల ప్రసాదరావు కనబరుస్తున్న ప్రేమతో అతనిని నమ్మడం ప్రారంభించింది. 2020లో ఇరువురూ శారీరకంగా ఒక్కటయ్యారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా ప్రసాదరావు ఆమెతో 2, 3 రోజులుగా గడిపేవాడు. డబ్బు, బంగారం ఇచ్చేవాడు. కువైట్‌లో ఉన్నప్పుడు ఆమెతో వీడియో కాల్‌లో మాట్లాడేటప్పుడు ప్రైవేటు పార్ట్స్‌ను స్క్రీన్‌ రికార్డ్‌ చేశాడు. ప్రైవేటుగా కలిసే సమయంలో ఆమె ఫొటోలను సేవ్‌ చేశాడు. రోజులు గడిచే కొద్దీ ప్రసాదరావు ప్రవర్తన ఆమె పట్ల మారుతూ వచ్చింది. ఆమె కోసం ఖర్చు చేసిన డబ్బును తిరిగి అడగడం ప్రారంభించాడు. లేదంటే తనతో ఉన్న ప్రైవేటు ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించసాగాడు. 

ఈ క్రమంలో వీరిద్దరి ఫొటోలను తన ఐడీ ద్వారా ఫేస్‌బుక్‌ స్నేహితులకు మెసెంజర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏపీలోని రాజోలు పొన్నమండలో ఉండే ప్రసాదరావు భార్య భవాని, తండ్రి రామకృష్ణ తదితరులు కలిసి ఆమె ఇంటికి వెళ్లి రూ.4,28,800 చెల్లించాలంటూ తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారు. బాధితురాలితో పాటు ఆమె కుమార్తెను బెదిరించి గొలుసు, ఉంగరాలు సహా 28 గ్రాముల బంగారాన్ని తీసుకున్నారు. బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ శనివారం జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించడంతో కేసు దర్యాప్తు జరుపుతున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement