నుమాయిష్‌కు వైరస్‌ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’ | Nampally Exhibition 2022: AIIE Society, Stall Holders Loses Revenue | Sakshi
Sakshi News home page

నుమాయిష్‌కు వైరస్‌ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’

Jan 8 2022 3:03 PM | Updated on Jan 8 2022 3:13 PM

Nampally Exhibition 2022: AIIE Society, Stall Holders Loses Revenue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ ఈ సంవత్సరం కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో రద్దయ్యింది. ఈ ప్రదర్శన కోసం జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సుమారు 1500 స్టాళ్లను ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందుకుగాను స్టాళ్ల నిర్వాహకుల నుంచి రూ.లక్ష రూపాయల అద్దె, ఇతరత్రా బిల్లులను సైతం తీసుకున్నారు. వీటిని తిరిగి శుక్రవారం నిర్వాహకులకు వాపస్‌ ఇచ్చేశారు. దీంతో చాలా మంది స్టాళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. తెచ్చిన సరుకును ప్యాక్‌ చేసుకుని వాహనాల్లో వారి స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. ఎగ్జిబిషన్‌ అకస్మాత్తుగా మూతపడడంతో సొసైటీకి, వ్యాపారులకు నష్టం వాటిల్లిందని సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు.  

నష్టం రూ.200 కోట్లు
ఎగ్జిబిషన్‌ ఈ ఏడాదీ శాశ్వతంగా మూతపడింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌ ఆంక్షలు అమలులో ఉన్నందున నుమాయిష్‌కు అనుమతి ఇవ్వలేమంటూ సిటీ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో రెండో ఏడాది నుమాయిష్‌ వచ్చినట్టే వచ్చి కనుమరుగైంది. దాదాపు 2 వేల దుకాణాలు కనీసం రూ.200 కోట్ల టర్నోవర్‌ ఎగ్జిబిషన్‌ సొంతం. ఇది సుదీర్ఘ కాలం సాగే ప్రదర్శన కావడంతో కశ్మీర్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌.. ఇలా వేర్వేరు ప్రాంతాల నుంచి దాదాపుగా 400 మంది వ్యాపారులు, సంబంధీకులు వచ్చేశారు. వీరిలో కొందరు చుట్టుపక్కల హోటల్స్‌లో, పేయింగ్‌ గెస్ట్‌ అకామడేషన్‌లలో బస చేశారు. ‘స్టాల్‌ కోసం రూ.లక్ష అద్దె చెల్లించా. రూ. 20వేలు జీఎస్టీ, రూ.25 వేల వరకు కరెంట్‌ బిల్లు కట్టాను. ఇవిగాక ప్రయాణ ఖర్చులూ వృథా అయ్యాయి’ అంటూ వాపో యాడు రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యాపారి. (చదవండి: కోవిడ్‌ టీకా తీసుకునేందుకు టీనేజర్ల అనాసక్తి)

నిర్వాహకులు విలవిల.. 
ఇప్పటికే రూ.60 లక్షల వ్యయంతో  స్టాళ్లు నిర్మించి, అనుమతి కోసం టౌన్‌ ప్లానింగ్‌ ఫీజ్‌ కింద రూ.74లక్షలు చెల్లించామని, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజ్‌ రూ.50లక్షలు కట్టామని నుమాయిష్‌ సెక్రటరీ చెప్పారు. తక్కువ ఫీజుతో నిర్వహించే 19 పాఠశాలలు, కాలేజీలకు ఏడాదికి రూ.12 కోట్ల వరకూ ఎగ్జిబిషన్‌ ఆదాయం నుంచి సబ్సిడీగా వెచ్చిస్తారు. వరుసగా రెండేళ్లు నుమాయిష్‌ మూత పడడంతో ఈ విద్యాసేవలకు గండిపడినట్టే. (చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది)

తీవ్రంగా నష్టపోయాం.. 
డ్రైఫ్రూట్స్‌ స్టాల్‌ తీసుకున్నాను. దీనికోసం అప్పు చేశాను. డ్రైఫ్రూట్స్‌ పాడైపోతే పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిపోతుంది. తీవ్రమైన నష్టాల పాలవుతాం. 
– ఆసిఫ్, కశ్మీర్‌

నిండా మునిగాం.. 
10 రోజుల తర్వాతైనా అనుమతిస్తారనే ఆశతో పనివాళ్లతో కలిపి రూమ్స్‌ అద్దెకు తీసుకున్నాం. ఇప్పటికే రూ.7 లక్షల విలువైన మెటీరియల్‌ తీసుకొచ్చాం. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు.
– ఇమ్రాన్‌ హుస్సేన్, వస్త్రవ్యాపారి, శ్రీనగర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement