తెలంగాణలోకి మావోయిస్టులు? | Maoists into Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలోకి మావోయిస్టులు?

Jun 22 2024 1:33 AM | Updated on Jun 22 2024 1:33 AM

Maoists into Telangana

దండకారణ్యంలో తీవ్రంగా పెరిగిన నిర్బంధం

ఆత్మరక్షణ కోసం వ్యూహం మార్చిన నేతలు 

దళాలుగా సంచరించడం వల్ల దాడుల్లో నష్టపోతున్నామనే అభిప్రాయం 

రాష్ట్రం వైపు దృష్టి.. రెక్కీ టీమ్‌లుగా ఎంట్రీ!

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:  దండకారణ్యంలో పోలీసు నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టులు షెల్టర్‌ జోన్‌గా తిరిగి తెలంగాణ బాట పడుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై భద్రతా దళాలు దాడులను తీవ్రం చేశాయి. జనవరిలో ఆకురాలే కాలంలో మొదలైన ముప్పేట దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో ఆత్మరక్షణ కోసం మావోయిస్టు పార్టీలో కీలక నేతలు తమ వ్యూహాలను మార్చినట్లు సమాచారం.

దళాలుగా సంచరించడం వల్ల పోలీసులు, కేంద్ర బలగాల దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్నామనే అభిప్రాయం ఆ పార్టీ నాయకత్వంలో ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో కీలక నాయకులను కాపాడుకోవడంతో పాటు పార్టీ ఉనికిని చాటుకునేందుకు వీలుగా తెలంగాణ వైపు ఫోకస్‌ పెట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇక్కడి నుంచి కొత్త రిక్రూట్‌మెంట్లపైనా దృష్టి సారించినట్లు తెలిసింది.

గోదావరి తీరం వెంట కదలికలు
గోదావరి తీరం వెంబడి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలతో పాటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో వివిధ కమిటీల పేర్లతో మావో యిస్టులు తమ ఉనికి చాటేందుకు గత నాలుగైదేళ్లుగా ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాలు ఎక్కు వగా లేఖలు, పోస్టర్లు, బ్యానర్ల వంటి అంశానికే పరిమితమయ్యాయి. దీంతో పార్టీ విస్తరణ విషయంలో సానుకూల ఫలితాలు పొందలేక వెనకడు గు వేశారు.

ఇప్పుడు మావోయిస్టులు రూటు మార్చారు. దళాల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి బదులు ఇద్దరు ముగ్గురు సభ్యులతో టీమ్‌లుగా ఏర్పడి తెలంగాణలో పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. రెండు వారాలుగా గోదావరి తీరం వెంట ఉన్న గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు కని్పంచడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

మద్దతుపై రెక్కీ టీమ్‌ల ఆరా
మావోయిస్టు పార్టీలో తలపండిన నాయకులు, ఉద్యమ వ్యూహాలు తెలిసిన వారు చిన్న టీమ్‌లుగా విడిపోయారు. ఈ బృందాలు ఇటీవల భద్రాద్రి – ములుగు జిల్లా సరిహద్దులో ఉన్న అటవీ గ్రామాల దగ్గర నుంచి గోదావరి తీరం దాటి రెక్కీ టీమ్‌లుగా వ్యవహరిస్తున్నా యని సమాచారం. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో తునికాకు కాంట్రాక్టర్లకు మావోల నుంచి హుకుం జారీ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణలోకి వచ్చిన రెక్కీ టీమ్‌ సభ్యులు తమకు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పరిస్థితి ఎ లా ఉంది? 

సానుభూతిపరుల నుంచి మద్దతు లభిస్తుందా, లేదా? అనే అంశాలను బేరీజు వేయడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.  ఇక బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకుల కదలికలపైనా దృష్టి సారించారని  సమాచారం. చర్ల మండల కేంద్రంలో ఐదుగురిని గురువారం ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారనేది స్పష్టత రాకపోయినా ఈ అంశం ఇప్పుడు ఏజెన్సీలో చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement