
సాక్షి, వరంగల్: కోతుల సైర్వ విహారంతో విసుగు వేసారిన ఆసుపత్రి నిర్వాహకులకు ఓ చక్కటి ఐడియా వచ్చింది. తక్షణమే కోతుల బెడద నుంచి ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు రక్షణ కల్పించేందుకు కొండముచ్చును కొని తెచ్చారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ఆసుపత్రికి కొండముచ్చు పహారా కాస్తోంది.
ఆసుపత్రికి వచ్చే వారిపై పలుమార్లు దాడులకు దిగి రోగులకు తెచ్చే తినుబండారాలను ఎత్తుకెళ్లిపోవడం గమనించిన ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ రాజనరేందర్ రెడ్డి.. రూ.30 వేలు వెచ్చించి ఏపీ నుంచి ఓ కొండముచ్చును ఆసుపత్రి కాపలా కోసం తెచ్చారు. దీంతో ఆసుపత్రి చుట్టుపక్కల కోతుల సంచారం లేకుండా పోయింది. కొండముచ్చు రాకతో ఆ ప్రాంతం కోతుల బెడద నుంచి ఉపశమనం పొందింది. ఆసుపత్రి నిర్వాహకులు చేసిన వినూత్న ఆలోచన పట్ల రోగులు వారి బంధువులు ప్రశంసలు కురిపిస్తున్నారు.