కేటీఆర్‌ భరోసా: ‘గూడు చెదిరిన గువ్వల’ ‘సాక్షి’ కథనం

KTR  Helps Children Of Sircilla Their Parents Deceased With Corona - Sakshi

సిరిసిల్ల: కరోనా కాటుకు అమ్మానాన్నలను కోల్పోయి అనాథలైన అన్నాచెల్లెళ్ల భవిష్యత్‌కు తాను భరోసా ఇస్తున్నానని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం స్పష్టం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌షేక్‌ ఖలీమ్‌ (40), అతడి భార్య నికత్‌ తబుసమ్‌ (38) ఐదు రోజుల వ్యవధిలో కరోనాతో మృతి చెందారు. దీంతో ఆ దంపతుల పిల్లలు అమాన్‌ (15), రుమాన (13) అనాథలయ్యారు. పిల్లలు కూడా కరోనాతో బాధపడుతున్నారు. పిల్లల పరిస్థితిపై ‘గూడు చెదిరిన గువ్వలు’శీర్షికన ‘సాక్షి’లో సోమవారం కథనం ప్రచురితమైంది.

దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌తో మాట్లాడారు. ఆ పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారి చదువులు, భవిష్యత్‌కు తాను అండగా ఉంటానని మంత్రి వెల్లడించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి ఎల్లయ్య, చైల్డ్‌లైన్‌ సిబ్బంది విద్యానగర్‌లోని చిన్నారుల ఇంటికి వెళ్లి నెలరోజులకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. పిల్లలను మెరుగైన వైద్యం కోసం సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు వారి వైద్య చికిత్సలను పర్యవేక్షించారు.
చదవండి: కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top