‘కంచ’ కథ.. తేలేదిఎప్పుడు? | Kancha Gachibowli 400 acre land issue: Telangana | Sakshi
Sakshi News home page

‘కంచ’ కథ.. తేలేదిఎప్పుడు?

Apr 8 2025 1:13 AM | Updated on Apr 8 2025 1:13 AM

Kancha Gachibowli 400 acre land issue: Telangana

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వివాదంపై ప్రతిష్టంభన 

ప్రభుత్వం.. విద్యార్థి సంఘాలు, పర్యావరణ వేత్తలు.. ఎవరి వాదనలు వారివి 

ఆ భూములు ప్రభుత్వానివేనంటూ కోర్టులు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తున్న సర్కారు పెద్దలు 

తెరపైకి ఎకో పార్క్, యూనివర్సిటీ తరలింపు ప్రచారం..  

ప్రభుత్వ పెద్దల్లోనే భిన్నాభిప్రాయాలు

సాక్షి, హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వ్యవహారం ఇప్పట్లో తేలేలా లేదు. ఆ భూములు ప్రభుత్వానివేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే పరిస్థితి లేదని, ఆ భూముల దగ్గర సర్వే చేసేందుకు కూడా అంగీకరించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2004లోనే ప్రభుత్వం యూనివర్సిటీకి ఈ భూములకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూములు ఇచ్చిన నేపథ్యంలో ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయని అంటోంది.

అందుకు భిన్నంగా ఈ భూములను యూనివర్సిటీకి తిరిగి అప్పగించాలనే డిమాండ్‌ చేయడమే కాకుండా, ఆ భూముల్లో పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బతినకుండా కాపాడాలని, ఆ ప్రాంత పరిసరాలు కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న నేపథ్యంలో ఈ భూమి లంగ్‌స్పేస్‌గా ఉపయోగపడుతుందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు, పర్యావరణవేత్తలు పట్టుబడుతున్నారు. అయితే ఆ ప్రాంతంలో స్టేడియంలు, భవన నిర్మాణాలు కొనసాగినప్పుడు లేని పర్యావరణ సమస్య ఇప్పుడే వచ్చిందా అంటూ కొందరు ప్రభుత్వ పెద్దలు స్పందిస్తున్నారు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి తప్పుడు వీడియోలు, ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని హైకోర్టులో ప్రభుత్వం ఫిర్యాదు చేయడం గమనార్హం.

కాగా కొందరు ప్రజాప్రతినిధులు పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యానికి కట్టుబడాల్సి వస్తే.. 400 ఎకరాలే కాకుండా యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 1600 ఎకరాలను కలిపి మొత్తం 2000 ఎకరాలతో అంతర్జాతీయ ఏకో పార్క్‌ నిర్మించాలంటూ ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. విద్యార్థులు, పర్యావరణవేత్తల డిమాండ్‌కు విరుగుడుగా ప్రభుత్వం మొత్తం యూనివర్సిటీని ఎకో పార్క్‌గా ఏర్పాటు చేద్దామనే ప్రచారాన్ని ముందుకు తీసుకు వస్తుండటంతో ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

యూనివర్సిటీని అవసరమైతే ఫ్యూచర్‌ సిటీకి తరలించాలనే ప్రతిపాదన కూడా ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్నట్లు ఆ వర్గాలు ప్రచారం చేస్తుండటం, విద్యార్థి సంఘాలు ఎంతమాత్రం వెనక్కి తగ్గకుండా మంత్రుల కమిటీ సమావేశానికి సైతం హాజరు కాకపోవడంతో వివాదం జటిలంగా మారింది. 

అయితే విద్యార్థులు, పర్యావరణవేత్తలకు కౌంటర్‌గా ఎకో పార్క్‌ నిర్మాణ అంశాన్ని తెరపైకి తేవడాన్ని, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన యూనివర్సిటీని ఏకంగా అక్కడినుంచి తరలించాలనే ఆలోచన సరికాదని కాంగ్రెస్‌ పారీ్టలో, ప్రభుత్వంలోని సీనియర్లు కొందరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇలాంటి లీకులు, ప్రచారం వల్ల నష్టం తప్ప లాభం ఉండదని వారన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ 400 ఎకరాలకు సంబంధించిన అంశం సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఇతర అంశాలను తెరపైకి తేవడం సరికాదనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నట్లు తెలిసింది.  

వేరే ఉద్దేశం లేదు! 
ఈ అంశంపై ఓ మంత్రి మాట్లాడుతూ సమస్య సామరస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామే తప్ప మరో ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమిటీ వేశారని గుర్తు చేస్తున్నారు. అయితే ఆ 400 ఎకరాలపై న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు ఇచ్చిన అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆ భూములు అటవీ భూములు కావన్న అంశాన్ని కూడా స్పష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

మరోవైపు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ కూడా దీనిపై దృష్టి పెట్టారని, యూనివర్సిటీ భాగస్వామ్య పక్షాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారని ఆయన వెల్లడించారు. సోమవారం ఆమె ఉపాధ్యాయ, పర్యావరణవేత్తలు, పౌర సమాజం నాయకులను వెంట పెట్టుకుని సచివాలయంలో మంత్రులతో సమావేశమయ్యారని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement