పంజగుట్ట/హిమాయత్నగర్: కుక్కల రక్తం విక్రయిస్తున్నవారిపై కఠినమైన చర్య తీసుకోవాలని ఆరుద్ర ఫర్ ఎనిమల్స్ అండ్ ఎని్వరాల్మెంట్ ఫౌండేషన్ డైరెక్టర్ హనుమంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్గా ఉంటూ జూబ్లీహిల్స్లో ప్రైవేట్ కుక్కల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నడుపుతున్నారని, అతనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జంతు సంరక్షకుడు శివ మాట్లాడుతూ ఒక ప్రైవేట్ పెట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు తనతో కుక్కల రక్తం తీయించి 350 ఎంఎల్ బ్యాగ్ను రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్ముకునే వారని తెలిపారు. ఈ దారుణాలు చూడలేక ఉద్యోగం మానేసి అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. సదరు ప్రైవేట్ క్లినిక్ నిర్వాహకుల నుంచి తనకు ప్రాణ భయం ఉందన్నారు.
ఆరోపణలు అవాస్తవం
ఇటీవల ‘శునకాల రక్తంతో వ్యాపారం’అని మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ కె.వెంకట్ యాదవ్ స్పష్టం చేశారు.
శుక్రవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో మీడియాతో మాట్లాడుతూ తమ వద్ద గతంలో పనిచేసిన కొందరు వ్యక్తులు హాస్పిటల్ను అప్రతిష్టపాలు చేయాలని కుట్రపన్నారని ఆరోపించారు. అధికారులు హాస్పిటల్ను తనిఖీ చేసి రక్తం విక్రయిస్తున్నట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారని పేర్కొన్నారు.


