ప్రధాన బుకింగ్ కౌంటర్ నుంచి ఆలయ మాడ వీధిలోకి వెళ్లే దారిలో భక్తుల సందడి
యాదగిరి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
యాదగిరిగుట్ట: వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం యాదగిరీశుడిని దర్శించుకునేందుకు సుమారు లక్షా వెయ్యిమందికి పైగా భక్తులు రావడంతో ధర్మ దర్శనానికి 4 గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. యాదగిరి కొండపైన ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు.
వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.81,77,104 వచ్చినట్టుఆలయాధికారులు వెల్లడించారు. కాగా, భక్తులు అధికంగా రావడంతో క్యూకాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది. దీంతో లోపలకు సరైన గాలి రాకపోవడంతో ఉక్కపోతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. మూత్రశాలలు, మరుగు దొడ్లకు వెళ్లేందుకు అవస్థలు ఎదుర్కొన్నారు. ఒక దశలో ఆలయ సిబ్బందితో వాగ్వావాదానికి దిగారు. ఆలయ మాడ వీధుల్లో మంచినీరు తాగేందుకు, బాటిల్స్లో నింపుకునేందుకు సైతం భక్తులు పోటీ పడ్డారు.
వాహనాల బారులు
వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో శ్రీస్వామిని దర్శించుకునేందుకు తమ వాహనాల్లో రావడంతో కొండపైన, కొండ కింద ఎక్కడ చూసినా కార్లు, బైక్లే కనిపించాయి. భారీగా వాహనాలు రావడంతో సెంట్రల్ పార్కింగ్, ఘాట్ రోడ్డు, కొండపైకి వెళ్లే రూ.500 టికెట్ తీసుకునే చెక్పోస్టు వద్ద క్యూకట్టాయి. ఉదయం నుంచి భక్తులతో పాటు వాహనాల రద్దీ కనిపించింది.


