ఢిల్లీ: లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు(వీహెచ్) లేఖ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని రాహుల్గాంధీకి ఆయన లేఖ రాశారు. ప్రతిపక్ష నేతగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలి. రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేలా చూడాలనిపార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్లకు లేఖలు రాసినట్లు వీహెచ్ తెలిపారు.
‘‘రాహుల్ గాంధీ బీసీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదం పొందినా.. పొందకపోయినా బీసీల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి బిల్లు పెట్టాలని కోరా. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ సవరిస్తేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం అవుతుంది. మోదీ బీసీ అయినా బీసీలకు న్యాయం చేయడం లేదు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో ధర్నా కూడా చేశాము. తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో శ్రీరాముని కళ్యాణం జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతాను’’ అని వీహెచ్ తెలిపారు.


