భూగర్భ జలాలకు మేలు! | Groundwater levels increased in May: Telangana | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాలకు మేలు!

Jun 16 2025 5:32 AM | Updated on Jun 16 2025 5:32 AM

Groundwater levels increased in May: Telangana

ముందస్తు వర్షాలతో మే నెలలో పెరిగిన భూగర్భ జలమట్టం

ఏప్రిల్‌లో రాష్ట్ర భూగర్భ జలాల సగటు లోతు 10.17 మీటర్లు

మేలో 10.07 మీటర్ల సగటు లోతుకే భూగర్భ జలాల లభ్యత

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు వర్షాలతో వేసవి ముగియక ముందే రాష్ట్రంలో భూగర్భ జలమట్టాల్లో పెరుగుదల ప్రారంభమైంది. మండుటెండలు, సాగు, తాగు, ఇతర అవసరాలకు నీటి వినియోగం అధికంగా ఉండటంతో గత ఏప్రిల్‌ నాటికి భూగర్భ జలాల రాష్ట్ర సగటు మట్టం 10.17 మీటర్ల లోతుకు పడిపోయింది. ముందస్తుగా రుతుపవనాల రాకతో ఆ తర్వాతి మే నెలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ నెలలో రాష్ట్ర భూగర్భ జలమట్టాల సగటు లోతు 10.07 మీటర్లకు తగ్గింది. 2024 మేతో పోల్చితే 2025 మేలో 0.30 మీటర్ల పెరుగుదల కనిపించింది.

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భూగర్భ జల మట్టాలు మరింతగా పెరగనున్నాయి. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ ఏప్రిల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

15 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం 
రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్‌ జిల్లాలో 15.44 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 5.68 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. 

భూగర్భ జలాలు 0– 5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. ఒక్క జిల్లాలో కూడా 0–5 మీటర్ల లోతులో భూగర్భ జలమట్టం లేదని గుర్తించారు. 
⇒ 17 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతులో, 13 జిల్లాల్లో 10–15 మీటర్ల లోతులో, 3 జిల్లాల్లో 15 మీటర్లకి మించిన లోతులో భూగర్భ జలాలున్నట్టు తేలింది. 
⇒ 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. 15 జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 

సాధారణానికి మించి 32% అధిక వర్షపాతం 
గతేడాది రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 919 మి.మీ.లు కాగా, 2024–25 నీటి సంవత్సరంలో 1,216 మి.మీ.ల సగటు వర్షపాతం నమోదైంది. అంటే, 2024 జూన్‌ నుంచి 2025 మే చివరి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే 32శాతం అధిక వర్షం కురిసింది.

19 జిల్లాల్లో భూగర్భ జలాల వృద్ధి
2024 మేతో పోల్చితే 2025 మేలో 19 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో వృద్ధి నమోదు కాగా, మరో 14 జిల్లాల్లో క్షీణత కనిపించింది. గత ఏడాది మేలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 10.36 మీటర్లు కాగా.. ఈ ఏడాది మేలో 10.07 మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 2.3 మీటర్లు, అత్యల్పంగా గద్వాల జిల్లాలో 0.05 మీటర్ల వృద్ధి నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలో 3.02 మీటర్లు, అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 0.01 మీటర్ల క్షీణత కనిపించింది.

ఈ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో..
రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నైరుతి, మధ్య ప్రాంతాలు, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దక్షిణాది ప్రాంతాలు, నిర్మల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లోని పశ్చిమ ప్రాంతాలు, భూపాలపల్లి జిల్లాలోని ఉత్తర, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయికి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మధ్య, కొన్నిచోట్ల 20 మీటర్లకన్నా లోతుకు వెళ్లిపోయినట్టు తేల్చారు. రాష్ట్ర భూభాగం ఈ ప్రాంతాల వాటా 14 శాతం కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement