సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ చెప్పినట్లు రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కేవలం 30-35 శాతానికి మించి ధాన్యం కొనుగోలు చేయలేదని తెలిపారు. మంత్రులు 50 శాతం కొనుగోలు చేశామంటే సీఎం రేవంత్ ఏకంగా 80 శాతం ధాన్యం కొనుగోలు చేశామంటూ అసత్యాలు పలుకుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్షంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఎద్దు ఏడ్చిన వ్యవసాయం. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆఖరుకు సీఎం నియోజకవర్గం కొడంగల్లో కూడా రైతులు ధర్నాలు చేస్తున్నారని దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్టంలో గన్నీ బ్యాగ్స్ దొరకడం లేదు కానీ గన్స్ మాత్రం బాగా దొరుకుతున్నాయని ప్రభుత్వాన్ని కేటీఆర్ దుయ్యబట్టారు.


