రెండో రోజు కొనసాగిన డ్రగ్స్ కేసు విచారణ
మొయినాబాద్, శంషాబాద్ రూరల్: డ్రగ్స్ పార్టీ కేసులో కస్టడీకి తీసుకున్న నిందితుల విచారణ రెండో రోజూ కొనసాగింది. ప్రధాన నిందితులైన పైలెట్ రోహిత్రెడ్డి, రితీష్రెడ్డి, నమిత్శర్మను బుధవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు యోగేష్ గౌతం, శిరీష వేర్వేరుగా విచారణ చేశారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరిగింది? ఎవరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేశారు? గతంలో ఎన్నిసార్లు డ్రగ్స్ పార్టీలు జరిగాయి? అనే అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. సాయంత్రం ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు శంషాబాద్ పీఎస్కు వచ్చారు.
ఆయన నిందితులను విచారించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. రెండో రోజు కూడా మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి సరైన సమాధానాలు చెప్పకుండా మౌనం వహించినట్లు తెలిసింది. మరో వైపు ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరికొంత మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా, కేసులో ప్రధాన నిందితులైన రోహిత్రెడ్డి, రితీష్రెడ్డి, నమిత్శర్మల కస్టడీ గురువారం ముగి యనుంది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న 11 మందిలో 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరిలో ఏలూరు ఎంపీ మహేశ్కుమార్ యాదవ్ మినహా మిగతా వారిని 6 రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. వారు చెప్పిన అంశాలు, ప్రధాన నిందితులు చెప్పిన విష యాలను పోల్చి చూస్తూ, ఈ కేసులో మరికొంత మంది ప్రమే యం ఉందని సిట్ అధికారులు గుర్తించారు. వీరిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.


