సీసీఎస్‌ను ఆశ్రయించిన ఏడో నిజాం మనవరాలు | A dispute related to Nizams properties reached CCS | Sakshi
Sakshi News home page

సీసీఎస్‌ను ఆశ్రయించిన ఏడో నిజాం మనవరాలు

Oct 7 2024 4:33 AM | Updated on Oct 7 2024 4:33 AM

A dispute related to Nizams properties reached CCS

కోర్టు ద్వారా ఫిర్యాదు చేసిన ఫాతిమా ఫౌజియా

తన పేరిట నకిలీ జీపీఏతో ముగ్గురు వ్యక్తులు వారసత్వ సర్టిఫికెట్‌ పొందారని ఆరోపణ 

సాక్షి, హైదరాబాద్‌: నిజాం ఆస్తులకు సంబంధించిన ఓ వివాదం హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైం స్టేషన్‌ (సీసీఎస్‌)కు చేరింది. తన పేరిట ముగ్గురు వ్యక్తులు నకిలీ జీపీఏ సృష్టించి కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్‌ పొందారని ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌ మనవరాలు ఫాతిమా ఫౌజియా సీసీఎస్‌లో క్రిమినల్‌ ఫిర్యాదు చేశారు. 

ఏడో నిజాం రెండో కుమారుడైన వాలాషాన్‌ ప్రిన్సెస్‌ మౌజ్జమ్‌ ఝా బహదూర్‌ కుమార్తె ఆమె. తొలుత నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కేసు నమోదు చేయకపోవడంతో హైదరాబాద్‌లోని అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. స్పందించిన న్యాయస్థానం.. కేసు నమోదు చేయాలని సీసీఎస్‌ను ఆదేశించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
వారసత్వ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలి..: ‘బషీర్‌బాగ్‌కు చెందిన మిలాద్‌ అలీ ఖాన్, నాంపల్లికి చెందిన సాజిద్‌ అలీఖాన్, బంజారాహిల్స్‌కు చెందిన మీర్‌ మిర్జా అలీఖాన్‌ ఉమ్మడిగా ఏడో నిజాంకు సంబంధించిన ఆస్తులకు వారసులమని.. నా పేరిట నకిలీ జీపీఏతో 2016లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ద్వారా వారసత్వ సర్టిఫికెట్‌ పొందారు. అనంతరం నా ఆస్తిలోనూ వాటా ఉందంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు. 

అలాగే తమిళనాడులోని నీలగిరి, ఊటీల్లో ఉన్న దాదాపు రూ. 121 కోట్ల విలువైన ఏడో నిజాం ఎస్టేట్స్‌లో వాటా పంచాలని కోర్టుకెక్కారు. నా తండ్రి, సోదరుడి నుంచి నాకు సంక్రమించిన 36 శాతం ఆస్తుల వాటాను తక్కువగా చూపించడంతోపాటు పూర్తిగా ఎస్టేట్‌ను కాజేసేందుకు కుట్ర చేస్తున్నారు’అని ఫాతిమా కోర్టులో వేసిన ప్రైవేటు ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు పొందిన వారసత్వ సరి్టఫికెట్‌ బోగస్‌ అని, దాన్ని రద్దు చేయాలని కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement