నిందితుడు ఆనంద్కుమార్
వాటి ఆచూకీ దొరకవద్దని ఇంటి పని మనిషి పన్నాగం
రూ.14 లక్షల విలువైన డైమండ్ రింగ్, మరో నగ స్వాధీనం
బంజారాహిల్స్: తాను పని చేస్తున్న ఇంట్లో రూ.14 లక్షల విలువైన వజ్రాభరణాలను అపహరించి.. వాటి ఆచూకీ దొరకవద్దనే ఉద్దేశంతో చెత్తకుప్పలో దాచిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ డీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డునెంబర్–25లో నివసించే అమీదుల్లాఖాన్, బేగం దంపతుల ఇంట్లో బోరబండ సైట్–3లో ఉంటున్న బిహార్కు చెందిన ఆనంద్కుమార్ ముక్యా (32) ఆరు నెలల క్రితం పనిలో చేరాడు. గత నెల 23న యజమాని ఇంట్లోని డైమండ్ రింగ్తో పాటు వజ్రాభరణాలు తస్కరించి పరారయ్యాడు.
ఆనంద్కుమార్తో పాటు గుడ్డు అనే ఇద్దరు పని మనుషులపై బాధితులు అనుమానం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు అనుమానితులను తమదైన శైలిలో విచారించి.. బోరబండలోని ఆనంద్కుమార్ గదిలో సోదాలు చేయగా.. ఓ మూలకున్న చెత్త కుప్పలో రూ.14 లక్ష విలువైన డైమండ్ రింగ్తో పాటు మరో ఆభరణం పోలీసులకు లభించాయి. వజ్రాభరణాలను తానే చోరీ చేశానని.. తనపై అనుమానంతో పోలీసులు సోదాలు చేస్తే ఆభరణాలు దొరకవద్దనే ఉపాయంతో చెత్త కుప్పలో దాచినట్లు నిందితుడు వెల్లడించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆనంద్కుమార్ను రిమాండ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


