హైదరాబాద్: నగరంలో వాటర్ బోర్డు బిల్లుల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ ఖాతాలో తెలిపారు. “మీ నీటి బిల్లు బకాయి ఉంది. వెంటనే డబ్బులు చెల్లించకపోతే వాటర్ కనెక్షన్ కట్ చేస్తామంటూ వాటర్ బోర్డు అధికారుల పేరుతో ఫోన్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఆపై HMWSSB WATER BILL UPDATE.apk పేరుతో ఒక ప్రమాదకరమైన లింక్ను పంపి, దాన్ని ఇన్స్టాల్ చేయాలని నమ్మిస్తున్నారు. ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేస్తే, మీ మొబైల్ నియంత్రణ మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. మీ కాల్స్ను డైవర్ట్ చేయడమే కాకుండా, మీ స్క్రీన్ను నిరంతరం గమనిస్తూ బ్యాంక్ లావాదేవీలకు వచ్చే ఓటీపీలను తస్కరించి క్షణాల్లో ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
నగరవాసులు ఇలాంటి బెదిరింపులకు ఆందోళన చెందవద్దు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే ఎటువంటి ఏపీకే ఫైళ్లను పొరపాటున కూడా ఇన్స్టాల్ చేయకండి. కేవలం అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక మొబైల్ యాప్ల ద్వారానే మీ నీటి బిల్లులు చెల్లించండి. ఎవరైనా అనుమానాస్పదంగా ఫోన్ చేస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి.
ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్కు కాల్ చేయండి లేదా http://cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయండి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు’’ అని సూచించారు.


