సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, పండితుల ఆశీర్వచనాలతో ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఇతర ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తానన్నారు.
సీవీ ఆనంద్ నేపథ్యం
ఐపీఎస్ 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్.. నక్సలైట్ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా, ట్రాఫిక్ కమిషనర్గా, సైబరాబాద్ కమిషనర్గా, అలాగే హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విస్తృతమైన సేవా అనుభవం ఉంది.
తన సర్వీస్ ఆరంభంలోనే వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేసిన ఆయన నక్సలైట్ మావోయిస్టు సమస్యను ఎదుర్కొన్నారు. ఆయుధ సరఫరా గొలుసును అడ్డుకోవడంలో, యువతను నక్సలైట్ ప్రభావం నుంచి దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దానితో పాటు పోలీసుశాఖలో మరెన్నో కీలక పదవులు అధిరోహించారు.
ప్రముఖ పదవులు
కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్
కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్
ట్రాఫిక్ కమిషనర్, హైదరాబాద్ (ఇక్కడే డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభించారు)
డైరెక్టర్ జనరల్, యాంటీ-కరప్షన్ బ్యూరో
స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోం శాఖ
సంస్కరణలు-ఆవిష్కరణలు
ఈ-చలాన్, స్పీడ్ గన్స్, రివర్సిబుల్ లేన్లు, "ఫ్రీ లెఫ్ట్" వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు.
సైబరాబాద్లో సీసీటీవీ, ఐటీ ఆధారిత పోలీసింగ్, షీ టీమ్స్, షీ షటిల్స్ వంటి మహిళా భద్రతా కార్యక్రమాలు ప్రారంభించారు.
పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS): ఆధార్ ఆధారిత రేషన్ వ్యవస్థ, GPS ట్రాకింగ్, ఆన్లైన్ చెల్లింపులు ప్రవేశపెట్టి రాష్ట్రానికి ₹2000 కోట్లు ఆదా చేశారు.
అవార్డులు
పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్
పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్
తెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు


