
హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా కలెక్టర్లంతా అప్రమత్తండా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఈరోజు(సోమవారం, జూలై 21) జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో వర్షాలపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్.‘వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలి. జూన్ నుంచి ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతంనమోదైనా… గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో 150 బృందాలను ఏర్పాటు చేశాం.
వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ రూం నుంచి సమన్వయం చేసుకుని ముందుగానే టీంలను పంపిస్తున్నాం. పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు గ్రౌండ్ లో ఉండాలి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలి. జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు నమోదు చేయాలి. గిరిజనులు అంటువ్యాధుల బారిన పడకుండా ఐటీడీఏ ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
పీహెచ్సీ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నా. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ప్రతీ రోజు కలెక్టర్ల కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వానికి పూర్తి రిపోర్టును అందించాలని సీఎస్ ను ఆదేశిస్తున్నా. వర్షాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి సంబంధించి వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.